ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదని దాడి
ABN , First Publish Date - 2020-08-09T06:46:29+05:30 IST
యాదాద్రి జిల్లాలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందాడు. చౌటుప్పల్..
- యాదాద్రి జిల్లాలో ఒకరి మృతి
- మృతదేహంతో బంధువుల ఆందోళన
చౌటుప్పల్ రూరల్, ఆగస్టు 8: యాదాద్రి జిల్లాలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందాడు. చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట గ్రామపంచాయతీ గత ఎన్నికల్లో దండుగుల ఎల్లమ్మ సర్పంచ్గా బరిలో దిగింది. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది. తమకు సమీప బంధువైన దుతాంగుల వెంకటేశ్ కుటుంబసభ్యులు సహకరించకపోవడంతోనే ఓడిపోయామని ఆమె కుమారులు కక్ష పెంచుకున్నారు.అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య వివాదం నడుస్తోంది. శుక్రవారంరాత్రి ఎల్లమ్మ కుమారులు, వెంకటే్షపై ఇనుపరాడ్డుతో దాడి చేశారు. తీవ్రగాయాలైన వెంకటే్షను చౌటుప్పల్ అసుపత్రికి, అటు నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మృతి చెందాడు. దీంతో వెంకటేష్ మృతికి ఎస్ఐ నాగేశ్వరరావు నిర్లక్ష్యమే కారణమంటూ ఎంపీపీ తాడూరు వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో బంధువులు పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించి ఎస్ఐపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనకు ఎల్లమ్మ కుటుంబసభ్యుల నుంచి ప్రాణహాని ఉందని అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఎస్ఐ పట్టించుకోలేదని ఆరోపిస్తూ ధర్నా చేశారు. ఎస్ఐని రాచకొండ కమిషనరేట్కు అటాచ్ చేస్తున్నట్టు సీఐ వెంకన్న ప్రకటించడంతో బాధితులు ఆందోళన విరమించారు. నిందితులు యాదగిరి, రమేష్, వెంకటేష్, దేవేందర్, వెంకటే్షలపై హత్య కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. కాగా, వెంకటేష్ మృతితో ఆగ్రహించిన బంధువులు ఎల్లమ్మ ఇంటిపై దాడిచేసి ఫర్నిచర్, కారును దహనం చేశారు.