ఆమంచి, బలరాం వర్గాల బాహాబాహీ
ABN , First Publish Date - 2020-05-31T09:21:44+05:30 IST
ప్రకాశం జిల్లా వేటపాలెం మండలపరిధిలోని మత్స్యకార గ్రామం రామాపురంలో శనివారం వైసీపీలోని ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురికి గాయాలయ్యాయి. దాడుల నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వేటపాలెం, మే 30: ప్రకాశం జిల్లా వేటపాలెం మండలపరిధిలోని మత్స్యకార గ్రామం రామాపురంలో శనివారం వైసీపీలోని ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురికి గాయాలయ్యాయి. దాడుల నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొంతకాలంగా గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి, ఎమ్మెల్యే బలరాం వర్గాల మధ్య వివాదాలు ఉన్నాయి. దీనిపై పోలీ్సస్టేషన్లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది ముగిసిన సందర్భంగా చీరాలలో ఏర్పాటుచేసిన సమావేశానికి గ్రామానికి చెందిన కొందరు వెళ్లారు. కార్యక్రమానికి హాజరై గ్రామానికి వచ్చిన యువకులతో రెండో వర్గం వారు వాగ్వాదానికి దిగారు. చివరకు అది ఘర్షణకి దారితీయడంతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఆరుగురికి గాయాలయ్యాయి. గొడవ జరుగుతున్న సమయంలో గ్రామంలోకి ఎవ్వరినీ రాకుండా చెట్లకొమ్మలు రోడ్డుకి అడ్డుగా వేశారు. సమాచారం అందుకున్న చీరాల టౌన్ సీఐ నాగమల్లేశ్వరావు, టూటౌన్ సీఐ ఫిరోజ్, రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, సిబ్బందితో వెళ్లి ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపుచేశారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.