యుద్ధంతో నరకం.. గడియ ఒక గండంగా జీవించాం..!
ABN , First Publish Date - 2022-03-07T11:47:13+05:30 IST
యుద్ధం జరుగుతున్న వేళ ఉక్రెయిన్ నుంచి తమ కుమార్తె క్షేమంగా
- ఉక్రెయిన్ నుంచి నగరానికి చేరుకున్న మెడిసిన్ విద్యార్థిని
హైదరాబాద్ సిటీ/కవాడిగూడ : యుద్ధం జరుగుతున్న వేళ ఉక్రెయిన్ నుంచి తమ కుమార్తె క్షేమంగా నగరానికి చేరుకోవడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. కుమార్తెను హత్తుకుని తల్లిదండ్రులు ఆనందభాష్పాలు రాల్చారు. ముషీరాబాద్ నియోజకవర్గం పరిధి కవాడిగూడ డివిజన్ మారుతీనగర్కు చెందిన చెలిమల్ల సునీల్ ఏకైక కుమార్తె గ్రేసి మృధుభాషిణి ఉక్రెయిన్లోని జప్రోజియా పట్టణంలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్బంగా మృధుభాషిణి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ, యుద్ధంతో నరకం అనుభవించామని, గడియ ఒక గండంగా జీవనం సాగించామని తెలిపారు. ప్రాణాలతో స్వదేశానికి వెళ్తామా అనే సందేహం కలిగిందన్నారు. బంకర్లలో ఆరు నుంచి 12 గంటల వరకు అష్టకష్టాలు పడుతూ గడిపామని ఆమె చెప్పారు.
క్షేమంగా చేరుకున్న అనీల
బౌద్ధనగర్ : సికింద్రాబాద్ సీతాఫల్మండికి చెందిన గడిపె అనీల ఉక్రెయిన్ నుంచి ఆదివారం తెల్లవారుజామున క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. యుద్ధం సమయంలో కొన్నిరోజులు బంకర్లో తలదాచుకున్నామని అన్నారు. ఈనెల 3న 20 మందితో రైలు ప్రయాణం ద్వారా హంగేరికి చేరామన్నారు. అక్కడి నుంచి విమానంలో 5న ఢిల్లీకి, అక్కడ నుంచి తెలంగాణ ప్రభుత్వం సమకూర్చిన విమానంలో హైదరాబాద్ చేరుకున్నామని తెలిపారు.