కొవిడ్‌ ఇంజెక్షన్‌లు పంపిస్తానని మోసం..

ABN , First Publish Date - 2021-06-25T13:59:25+05:30 IST

కొవిడ్‌ ఇంజెక్షన్లు పంపిస్తానని రూ.1,80,774 తీసుకుని మోసం చేసిన

కొవిడ్‌ ఇంజెక్షన్‌లు పంపిస్తానని మోసం..

  •  ఇద్దరు విదేశీయుల అరెస్ట్‌

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : కొవిడ్‌ ఇంజెక్షన్లు పంపిస్తానని రూ.1,80,774 తీసుకుని మోసం చేసిన ఇద్దరు విదేశీయులను సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. చార్మినార్‌కు చెందిన ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యుడికి కొవిడ్‌ చికిత్స నిమిత్తం ఇటోలిజుమాబ్‌, టోసిలిజుమాబ్‌ ఇంజెక్షన్‌ల కోసం ఇంటర్నెట్‌లో వెతికాడు. ఇండియా మార్ట్‌లో ప్రభుత్వ గుర్తింపు పొందిన హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌ కేర్‌ లిమిటెడ్‌ ఇంజెక్షన్‌లు సరఫరా చేస్తుందని తెలియడంతో తన ఫోన్‌ నెంబరుతో ఎంక్వైయిరీ పంపించాడు. కొద్ది సేపటికి ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌ నుంచి మాట్లాడుతున్నట్టు చెప్పాడు. 


ఇంజెక్షన్‌లకు 1,80,774 రూపాయలు అవుతుందని, డబ్బును తమ ఖాతాకు బదిలీ చేస్తే మూడు గంటల్లో ఇంజెక్షన్‌లు పంపిస్తామని చెప్పాడు. ఇది నమ్మిన వ్యక్తి డబ్బు బదిలీ చేశాడు. కాని రోజులు గడుస్తున్నా ఇంజెక్షన్‌లు రాలేదు. తనకు వచ్చిన ఫోన్‌ నెంబర్‌కు చేస్తే అది పనిచేయలేదు. మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంకు ఖాతా, ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా నిందితులు కెమెరూన్‌ దేశానికి చెందిన జఫ్‌ డెక్లాన్‌, టాన్జెనియాకు చెందిన మాతీస్‌ షా నిందితులుగా గుర్తించారు. బెంగళూరు కేంద్రంగా మోసాలు చేస్తున్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి నిందితులను అరెస్టు చేశారు.

Updated Date - 2021-06-25T13:59:25+05:30 IST