శాస్త్రవేత్తలు షాక్.. ‘మగతోడు’ లేకుండా ఇదెలా సాధ్యం అంటూ..
ABN , First Publish Date - 2021-01-23T21:39:59+05:30 IST
నమ్మకమే పునాదిగా కలిగిని ఆధ్యాత్మిక చింతన ఓవైపు.....తర్కంపై ఆధాపరడిన శాస్త్రపరిజ్ఞానం మరోవైపు. ఈ రెండిటి సాయంతో మనిషి ఇటు కనిపించే ప్రపంచాన్ని అటు కనిపించని లోకాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు.
ఇంటర్నెట్ డెస్క్: నమ్మకమే పునాదిగా కలిగిని ఆధ్యాత్మిక చింతన ఓవైపు.....తర్కంపై ఆధాపడిన శాస్త్రపరిజ్ఞానం మరోవైపు... ఈ రెండిటి సాయంతో మనిషి ఇటు కనిపించే ప్రపంచాన్ని అటు కనిపించని లోకాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ.. ఇలా ఎంతటి జ్ఞానం సముపార్జించినా కూడా మనిషికి తెలియనిది, తెలుసుకొవాల్సినది ఇంకా ఎంతో ఉందని ప్రకృతి నిత్యం మనకు గుర్తు చేస్తుంటుంది. అలాంటి ఘటన ఒకటి..న్యూజీల్యాండ్లో ఇటీవలే చోటుచేసుకుంది. ఫై ఫోటోలు కనబడుతున్న సముద్ర జీవులను రే ఫిష్ అంటారు. అయితే... ఆక్ల్యాండ్లోని సీలైఫ్ కెల్లీ టార్ల్టన్స్ అక్వేరియంలో ఉండే రెండు ఆడ రే ఫిష్లు ఈ ఏడాది ఆరంభంలో రెండు కూనలకు జన్మనిచ్చాయి.
కానీ.. గత రెండేళ్లుగా మగజీవికి దూరంగా ఉన్నప్పటికీ అవి సంతానం పొందడం శాస్త్రవేత్తలను షాక్కు గురిచేస్తోంది. వాస్తవానికి కొన్ని జీవ జాతుల్లో, అదీ అరుదుగా మాత్రమే ఈ విధమైన సంతానోత్పత్తి జరుగుతుంది. ఇందులో భాగంగా.. అండం ఫలదీకరణం చెందకుండానే పిండంగా మారి కొత్త జీవి ఉనికిలోకి వస్తుంది. శాస్త్రపరిభాషలో ఈ పద్ధతిని పార్థెనోజెనెసిస్ అంటారు. అయితే.. రే ఫిష్ లోనూ ఈ విధానం సాధ్యమేనని శాస్త్రవేత్తలు అసలేమాత్రం ఊహించలేదు. దీంతో వారు ప్రస్తుతం అమితాశ్చర్యానికి గురవుతున్నారు.
కాగా.. ఈ పరిణామాన్ని వివరించేందుకు అనేక థియరీలు(వివరణలు) తెరపైకి వస్తున్నాయి. చివరి సారి మగజీవితో కలయిక తరువాత ఆ ఆడ రే ఫిష్లు వీర్యాన్ని దాచుకుని సంతానాన్ని పొందాయని కొందరు నిపుణులు అంటున్నారు. మరికొందరు మాత్రం ఇది ‘మగజీవి అవసరమే లేని సంతానోత్పత్తి’ అని ఢంకా బజాయించి చెబుతున్నారు. అయితే. ఈ వివరణల సమర్థించే ఆధారాలేవీ ఇప్పటివరకూ లభించలేదు.