బోల్తాపడిన ట్రాక్టర్లు: ఇద్దరు రైతుల మృతి

ABN , First Publish Date - 2021-01-19T06:20:38+05:30 IST

పొలం దున్నుతూ ట్రాక్టర్లు బోల్తాపడి తంబళ్లపల్లె, తవణంపల్లె మండలాలకు చెందిన ఇద్దరు రైతులు మృతిచెందారు

బోల్తాపడిన ట్రాక్టర్లు: ఇద్దరు రైతుల మృతి
శ్రీనివాసులురెడ్డి మృతదేహం

తంబళ్లపల్లె/తవణంపల్లె, జనవరి 18: పొలం దుక్కి దున్నుతూ ట్రాక్టర్లు బోల్తాపడడంతో తంబళ్లపల్లె, తవణంపల్లె మండలాలకు చెందిన ఇద్దరు రైతులు మృతిచెందారు. తంబళ్లపల్లె మండలం చింపిరివాండ్లపల్లెకు చెందిన టి.శ్రీనివాసులురెడ్డి(45) వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నారు. దీంతోపాటు సొంత ట్రాక్టర్‌ను అద్దెకు కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు ఒప్పందం మేరకు సోమవారం ఆయన గ్రామానికి చెందిన ఓ రైతు వరి పొలంలో దుక్కి దున్నేందుకు వెళ్లారు. ఈ క్రమంలో బురదలో చక్రాలు కూరుకు పోవడంతో ఒక్కసారిగా ట్రాక్టర్‌ బోల్తాపడింది. వాహనం నడుపుతున్న శ్రీనివాసులురెడ్డిపై ఇంజన్‌ పడడంతో, స్థానికులు కాపాడేయత్నం చేశారు. చివరికి ఎక్స్‌కవేటర్‌ సాయంతో ట్రాక్టర్‌ను పక్కకు తొలగించి చూడగా, రైతు మృతదేహం బయటపడింది. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 


  కొత్తగొల్లపల్లెలోనూ.. 

తవణంపల్లె మండలం కొత్తగొల్లపల్లెకు చెందిన  రాజేంద్ర(51) వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నారు. సోమవారం ఆయన తన పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా బోల్తాపడింది. ట్రాక్టర్‌ కింద ఇరుకున్న ఆయన్ను స్థానికులు కాపాడేలోగా రాజేంద్ర మృతిచెందాడు. మృతుడి తమ్ముడు పురంధర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. 



Updated Date - 2021-01-19T06:20:38+05:30 IST