Kuwait బీచ్‌లో నీట మునిగి ఇద్దరు వలసదారులు మృతి.. ఒకరు గల్లంతు!

ABN , First Publish Date - 2021-10-10T13:51:28+05:30 IST

కువైత్‌లో శుక్రవారం విషాద ఘటన చోటు చేసుకుంది.

Kuwait బీచ్‌లో నీట మునిగి ఇద్దరు వలసదారులు మృతి.. ఒకరు గల్లంతు!

కువైత్ సిటీ: కువైత్‌లో శుక్రవారం విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక అల్ మెసిలహా బీచ్‌లో నీట మునిగి ఇద్దరు వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. మరోకరు గల్లంతు కావడంతో ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్ దళాలు గాలిస్తున్నాయి. అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. అల్ బెదా తీరంలోని అల్ మెసిలహా కోస్ట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం పది వలసదారులు బీచ్‌లో సరదాగా ఈత కొడుతున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద అల రావడంతో కొట్టుకుపోయారు. దీంతో బలమైన కెరటాల కారణంగా పది మంది ప్రమాదంలో పడ్డారని కోస్ట్ గార్డు ఆపరేషన్ రూమ్‌కు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న కోస్ట్ గార్డు సిబ్బంది.. తొమ్మిది మందిని బయటకు తీశారు. అనంతరం చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 


వీరిలో ఇద్దరు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఏడుగురు ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. కాగా, గల్లంతైన ఒకరి ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్ సిబ్బంది గజ ఈతగాళ్ల సహాయంతో వెతుకుతున్నాయి. అయితే, ప్రమాదం బారినపడ్డ వలసదారుల వివరాలను అధికారులు వెల్లడించలేదు. ఈ సందర్భంగా కోస్ట్ గార్డ్ అధికారులు బీచ్‌కు వచ్చే సందర్శకులను కీలక సూచన చేశారు. ప్రమాద హెచ్చరికలు ఉన్న చోట ఈతకు వెళ్లొద్దని సూచించారు. అనుకోకుండా ఎదైనా ప్రమాదం జరిగితే వెంటనే నెం.1880888 లేదా ఎమర్జెన్సీ హట్‌లైన్ నెం.112కు ఫోన్ చేసి చెప్పాలని తెలిపారు. 

Updated Date - 2021-10-10T13:51:28+05:30 IST