చోరీ కేసులో ఇద్దరు పాతనేరస్తుల అరెస్టు
ABN , First Publish Date - 2020-09-22T10:25:05+05:30 IST
ఓ వ్యక్తిని ఏమార్చి రెండు సెల్ఫోన్లు, రూ.35వేలకు టోకరా ఇచ్చిన ఇద్దరు పాత నేరస్తులను నాల్గో పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
సీతంపేట, సెప్టెంబరు 21: ఓ వ్యక్తిని ఏమార్చి రెండు సెల్ఫోన్లు, రూ.35వేలకు టోకరా ఇచ్చిన ఇద్దరు పాత నేరస్తులను నాల్గో పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీఐ సింహాద్రినాయుడు తెలిపిన వివరాలు ఇవీ. ప్రకాశం జిల్లా ముదురాజ మండలానికి చెందిన పులిశ్రీనివాస్ (52) అగర్తలలో కేఎంసీ కనస్ట్రక్షన్స్ కంపెనీ స్టోర్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు.
ఆయన ఈనెల 19న నగరానికి వచ్చాడు. తన ఊరు వెళ్లేందుకు రైల్వేస్టేషన్కు వెళ్లాడు. రాత్రి 7.30 గంటల సమయంలో రిజర్వేషన్ కౌంటర్ బయట వినాయక ఆలయం సమీపంలో ఆహారం కోసం వచ్చాడు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి శ్రీనివాస్ను మాటల్లో పెట్టి సెల్ఫోన్లు, నగదు దొంగిలించారు. దీంతో కంగుతిన్న అతను వెంటనే నాల్గో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడి పోలీసులు కొందరు పాత నేరస్తుల ఫొటోలు చూపించగా తనను మోసగించిన వారిని శ్రీనివాస్ గుర్తించాడు.
దీంతో డీసీపీ సురేష్బాబు, ఏడీసీపీ వేణుగోపాలరావు, ఏసీపీ శ్రావణ్కుమార్ల పర్యవేక్షణలో నిఘాపెట్టిన రెండు పోలీస్ బృందాలు అల్లిపురానికి చెందిన నీలాపు చంద్రశేఖర్ అలియాస్ ఐరన్మెన్ (28), ధర్మవరపు రోహిత్లను అదుపులోకి తీసుకుని విచారించగా నాగమల్లి ఎల్లాజీతో కలిసి దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి రూ.5వేలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ ఎన్.వి.భాస్కరరావు, ఏఎస్ఐ రంగనాథ్ పాల్గొన్నారు.