Mumbai:రైల్వేస్టేషన్లు, అమితాబ్ ఇంట్లో బాంబు పెట్టామంటూ బెదిరింపు

ABN , First Publish Date - 2021-08-07T17:18:01+05:30 IST

ముంబై నగరంలోని నాలుగు ప్రదేశాల్లో బాంబులు పెట్టామని బెదిరించిన ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ యూనిట్....

Mumbai:రైల్వేస్టేషన్లు, అమితాబ్ ఇంట్లో బాంబు పెట్టామంటూ బెదిరింపు

ఇద్దరు నిందితుల అరెస్ట్

ముంబై (మహారాష్ట్ర) : ముంబై నగరంలోని నాలుగు ప్రదేశాల్లో బాంబులు పెట్టామని బెదిరించిన ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ యూనిట్ శనివారం అదుపులోకి తీసుకుంది.గుర్తు తెలియని కాలర్ మూడు రైల్వే స్టేషన్లు,బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ బంగ్లాపై బాంబులతో దాడి చేస్తామని బెదిరించాడు.పోలీసుల దర్యాప్తులో బూటకపు కాల్‌గా తేలింది. బాంబు బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యవహారంలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి వారిని ప్రశ్నిస్తున్నామని ముంబై క్రైంబ్రాంచ్ పోలీసులు చెప్పారు. 


ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, దాదర్, బైకుల్లా రైల్వేస్టేషనుతోపాటు అమితాబ్ బచ్చన్ నివాసంలో బాంబులు పెట్టామని శుక్రవారం రాత్రి ముంబై పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ముంబై పోలీసులు బాంబు డిస్పోజల్ స్క్వాడుతో కలిసి నాలుగు ప్రాంతాల్లోనూ ముమ్మరంగా తనిఖీలు జరిపారు. ఎలాంటి బాంబు లేదని తేలడంతో బాంబు బెదిరింపు బూటకమని తేలింది. నిందితులు ఏ ప్రాంతం వారు? వారు ఎందుకు బెదిరింపు కాల్ చేశారో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-08-07T17:18:01+05:30 IST