పోలీసుల బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు..ఇద్దరు పోలీసుల మృతి

ABN , First Publish Date - 2021-12-14T02:23:34+05:30 IST

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు తెగబడ్డారు. పోలీసులతో వెళ్తున్న బస్సుపై విచక్షణ రహితంగా

పోలీసుల బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు..ఇద్దరు పోలీసుల మృతి

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు తెగబడ్డారు. పోలీసులతో వెళ్తున్న బస్సుపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోగా, 12 మంది గాయపడ్డారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఈ స్థాయిలో దాడి జరగడం ఇదే తొలిసారి. శ్రీనగర్ శివారులో శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై పంతాచౌక్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో తొలుత 14 మంది పోలీసులు గాయపడినట్టు అధికారులు తొలుత వెల్లడించారు. అయితే, ఆ తర్వాత చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు.

 

ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన ఇద్దరిలో ఒకరు ఏఎస్సై కాగా, సెలక్షన్ గ్రేడ్ కానిస్టేబుల్ ఉన్నారు. గాయపడిన వారిలోనూ మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొన్నట్టు ప్రాథమికంగా నిర్థారించారు. దాడి జరిగిన తీరును బట్టి ‘ఫిదాయీన్’ సంస్థకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు.


రెండు రోజుల క్రితమే బాండిపొరలో ఇద్దరు పోలీసులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. అంతలోనే ఈ ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు ఇటీవల కశ్మీర్ లోయలో పోలీసులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఉగ్రదాడుల్లో 19 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2021-12-14T02:23:34+05:30 IST