రెండు ఆటోలు ఢీకొని ఒకరి మృతి

ABN , First Publish Date - 2022-01-17T04:39:06+05:30 IST

రెండు ఆటోలు ఢీకొని ఒకరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.

రెండు ఆటోలు ఢీకొని ఒకరి మృతి
పాపిరెడ్డి మృతదేహం

నలుగురికి తీవ్రగాయాలు

పొదిలి (రూరల్‌) జనవరి 16 : రెండు ఆటోలు ఢీకొని ఒకరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దర్శి గ్రామానికి చెందిన నలుగురు పొదిలి మండలం సలకనూతల గ్రామంలో ఉన్న చెన్నకేశవస్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. అనంతరం తిరుగు ప్రయాణంలో తోల్లమడుగువాగు సమీపంలోకి వచ్చేసరికి అదే సమయంలో బుచ్చనపాలేనికి చెందిన వీరాంజనేయరెడ్డి, మల్లెల దేవసహాయం (32) లు ఆటోలో పొదిలికి వస్తున్నారు. ఇదే సమయంలో ఎదురుగా వస్తున్న దర్శికి చెందిన ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో దేవసహాయం మృతి చెందాడు. దర్శికి చెందిన ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. వారిని ఒంగోలుకు తరలించినట్లు ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 


మోటార్‌ బైక్‌ ఢీకొని వృద్ధుడి మృతి

పొదిలి (రూరల్‌) జనవరి 16 : మోటార్‌ బైక్‌ ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసు ల వివరాల ప్రకారం... పొదిలి అచ్చిరెడ్డి నగర్‌కు చెందిన పూనూరి పాపిరెడ్డి(70) శనివారం సాయంత్రం మొయిన్‌ రోడ్డు పై నడుచుకుంటూ పొదిలి వైపు వస్తున్న సమయంలో రాజంపల్లికి చెందిన ముగ్గురు యువకులు గొట్లగట్టులో జరుగుతున్న కబడ్డీ పోటీలు తిలకించి బైకుపై వస్తూ ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో పాపిరెడ్డి రెండు కాళ్లు, చేయి విరిగినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని వాహనంలో క్షతగాత్రున్ని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


అనారోగ్యంతో వీఆర్‌ఏ మృతి

బేస్తవారపేట, జనవరి 16 : బేస్తవారపేట వీఆర్‌ఏ కొట్టె రంగయ్య (55) అనారోగ్యం తో బాధపడుతూ శనివారం మృతి చెందారు. తహసీల్దార్‌ ఆదేశాల మేరకు రంగయ్య భార్యకు రూ.5వేల ఆర్థిక సాయంతోపాటు డివిజన్‌ వీ ఆర్వోల సంఘ అధ్యక్షుడు చింతగుంట సుబ్బరామిరెడ్డి సొంతంగా రూ.5వేల సాయాన్ని అందజేశారు. వీఆర్వోలు సుబ్బరామిరెడ్డి, గురవయ్య, ఆర్‌ఐ అనిల్‌కుమార్‌, మజీద్‌లు రంగయ్య మృతదేహానికి నివాళులర్పించారు.

Updated Date - 2022-01-17T04:39:06+05:30 IST