సదుంలో ఇద్దరి దారుణ హత్య

ABN , First Publish Date - 2022-05-21T05:30:00+05:30 IST

వివాహేతర సంబంధం తెచ్చిన అనర్థం ఇద్దరి ప్రాణాలు బలిగొంది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుంలో జరిగింది.

సదుంలో ఇద్దరి దారుణ హత్య
హత్యకు గురైన రాధారాణి

వివాహేతర సంబంధం తెచ్చిన అనర్థం 


కురబలకోట, మే 21: వివాహేతర సంబంధం తెచ్చిన అనర్థం ఇద్దరి ప్రాణాలు బలిగొంది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుంలో జరిగింది.  పోలీసుల కథనం మేరకు... పుట్టపర్తి జిల్లా ఎనములవారిపల్లెకు చెందిన రాధారాణి (28)కి అదే గ్రామానికి చెందిన నరసింహులుతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె సాయిచైతు (6) ఉంది. కాగా భర్తతో విడిపోయిన ఆమె ఇటీవల కురబలకోట మండలంలోని అంగళ్లులో నివాసం ఉండేది. అదే ప్రాంతానికి చెందిన రాముతో గత కొంతకాలంగా ఆమె సహజీవనం చేస్తుండేది. ఇటీవల ఇక్కడి నుంచి సదుం పట్టణంలోని ఎగువ జాండ్రపేటకు నివాసం మార్చారు. అక్కడ ఓ వాటర్‌ ప్లాంట్‌లో రాధ, రాము సహా ఆమె సోదరుడు వెంకటరమణ (31) కూలి పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో భర్త నరసింహులు తనతో రమ్మని రాధను నిలదీశాడు. దీంతో ఆమె ఎటూ తేల్చుకోలేక మౌనంగా ఉండిపోయింది. ఈ క్రమంలో రాధ భర్త దగ్గరకు ఎక్కడ వెళ్లిపోతుందోనన్న అనుమానంతో ఆమెతో రాము తరచూ గొడవ పడుతుండేవాడు. మూగవాడైన సోదరుడు వెంకటరమణ ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోయాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి పూటుగా తాగిన రాము మద్యం మత్తులో రాధతో ఘర్షణ పడ్డాడు. ఆవేశంలో బండరాయితో మోదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అడ్డుకోబోయిన రాధ సోదరుడిని కూడా హత్య చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న చౌడేపల్లె ఎస్‌ఐ రవికుమార్‌ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 



Updated Date - 2022-05-21T05:30:00+05:30 IST