రెండు బైకులు ఢీ : ఒకరు మృతి
ABN , First Publish Date - 2021-12-04T06:48:31+05:30 IST
వేగంగా వెళ్తున్న బైక్ను అదుపు చేయలేక మరొక బైకుకు ఢీకొట్టిన ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి.
పెద్దఅడిశర్లపల్లి, డిసెంబరు : వేగంగా వెళ్తున్న బైక్ను అదుపు చేయలేక మరొక బైకుకు ఢీకొట్టిన ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం శుక్రవారం కోదాడ- జడ్చర్ల జాతీయ రహదారిపై రంగారెడ్డిగూడెం మెయిన్ కెనాల్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం త్రిపురారం గ్రామానికి చెందిన తాటికొండ శేఖర్, తాటికొండ సాంబశివ టీఎస్ 29ఏ 6362 నెంబరు గల యూనికార్న్ బైక్పై వస్తున్నారు. నాగార్జునసాగర్ మేరిమాత మరియమ్మను దర్శించుకుని తిరుగు ప్రయాణంలో నల్లగొండకు వెళ్తున్నారు. రంగారెడ్డిగూడెం మెయిన్ కెనాల్కు రాగానే ముందుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై కొంత దూరం జారుతూ వెళ్లారు. వనపర్తి జిల్లా కొత్తకోట నుంచి గొర్రెల లోడుతో వస్తున్న టీఎస్ 06 యు.బి 1149 డీసీఎం ముందు టైరు కింద పడిపోయాడు. దీంతో డ్రైవర్ బ్రేక్ వేసినా సగభాగం టైర్ శేఖర్ మీదికి ఎక్కడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సాంబశివకు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గుడిపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయాలైన వ్యక్తితో పాటు మృతుడిని 108 వాహనంలో దేవరకొండ ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గుడిపల్లి ఎస్ఐ వీరబాబు తెలిపారు.