వేర్వేరు చోట్ల రెండు ఆటోల బోల్తా

ABN , First Publish Date - 2022-05-14T06:53:20+05:30 IST

నిత్యం ఏదోఒక చోట ప్రయాణికులతో వెళ్తున్న ఆటోలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ముఖ్యంగా పరిమితికి మించి ప్రయాణికులను ఆటోల్లో ఎక్కించుకోవడంతో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

వేర్వేరు చోట్ల రెండు ఆటోల బోల్తా

ఒకరు మృతి.. 

8 మందికి గాయాలు 

జుక్కల్‌ మే 13 : నిత్యం ఏదోఒక చోట ప్రయాణికులతో వెళ్తున్న ఆటోలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ముఖ్యంగా పరిమితికి మించి ప్రయాణికులను ఆటోల్లో ఎక్కించుకోవడంతో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. శుక్రవారం సైతం జిల్లాలో రెండు ఆటో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఒకరు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు. ఇందులో ఒక విద్యార్థి ఇంటర్‌ పరీక్షకు దూరమయ్యాడు. ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ నుంచి ఔరద్‌కు వెళ్తున్న ఆటో జుక్కల్‌ మండలం డోన్‌గాం మూల మలుపు వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రంలోని ఎక్లార గ్రామానికి చెందిన హజ్నాలే నీలకంఠ్‌ (55)  అనే వ్యక్తి సంఘటనలో స్థలంలోనే మృతిచెందాడని జుక్కల్‌ ఎస్సై వెంకట్రావు  తెలిపారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయని తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు. మూల మలుపు వద్ద అతివేగంగా ఉండడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

ఆటో బోల్తాపడి విద్యార్థులకు గాయాలు

ఎల్లారెడ్డి: మండలంలోని పెద్దరెడ్డి పెట్రోల్‌ పంపు వద్ద ఆటో బోల్తాపడడంతో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూర్‌ గ్రామానికి చెందిన భానుప్రసాద్‌, నర్సింలు, భాను అనే ముగ్గురు విద్యార్థులు, జలాల్‌పూర్‌ గ్రామానికి చెందిన పోచమ్మ, వెంకమ్మ సైతం అదే ఆటోలు ప్రయాణిస్తున్నారు. పెద్దరెడ్డి పెట్రోల్‌ పంపు వద్ద ఆటో ముందు కుక్కపిల్ల అడ్డు రాగా దాని తప్పించబోయి ఆటో బోల్తాపడింది.ఈ ఘటనలో భాను ప్రసాద్‌ అనే విద్యార్థికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రిలో చేరాడు. ఇంటర్‌ పరీక్షను రాయలేకపోయాడు. మిగిలిన విద్యార్థులతో పాటు, ఇద్దరు మహిళలకు స్వల్పగాయాలయ్యాయి. ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యం వలనే ప్రమాదం చోటుచేసుకుందని  బాధితులు తెలిపారు.

Read more