పేలుడు ఘటనలో ఇరువురు అరెస్టు

ABN , First Publish Date - 2021-05-11T05:38:50+05:30 IST

కలసపాడు మైనింగ్‌లో పేలుడు ఘటనకు సంబంధించి లీజుదారుడు నాగేశ్వరరెడ్డితో పాటు మైనింగ్‌ మేనేజరు పులివెందులకు చెందిన ఎర్రగుడి రఘునాథరెడ్డిలను అరెస్టు చేసినట్లు ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు.

పేలుడు ఘటనలో ఇరువురు అరెస్టు
మాట్లాడుతున్న ఎస్పీ అన్బురాజన్‌

పూర్తి స్థాయిలో విచారిస్తున్నాం : ఎస్పీ అన్బురాజన్‌


కడప (క్రైం), మే 10: కలసపాడు మైనింగ్‌లో పేలుడు ఘటనకు సంబంధించి లీజుదారుడు నాగేశ్వరరెడ్డితో పాటు మైనింగ్‌ మేనేజరు పులివెందులకు చెందిన ఎర్రగుడి రఘునాథరెడ్డిలను అరెస్టు చేసినట్లు ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఓఎస్డీ దేవప్రసాద్‌, ఎస్‌బీ డీఎస్పీ శివారెడ్డిలతో కలిసి సోమవారం ఎస్పీ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 8న కలసపాడు మండలం మామిళ్లపల్లె సమీపంలో ముగ్గురాళ్ల క్వారీ వద్ద జరిగిన పేలుళ్లలో పది మంది మృతి చెందారని, మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం వారి బంధువులకు అప్పగించామన్నారు. పేలుడు పదార్థాలను దాదాపు 20 బాక్సులో లోడింగ్‌ చేసుకుని కారులో మైనింగ్‌ వద్దకు తీసుకెళ్లారన్నారు. అందుకు సంబంధించిన మేనేజరు లక్ష్మిరెడ్డి కూడా వెళ్లాడని, ఒక్కో బాక్సులో 50 స్టిక్స్‌ ఉంటాయని అన్నారు. మొత్తం వెయ్యి స్టిక్స్‌ ఉంటాయని, కారులో నుంచి అన్‌లోడింగ్‌ చేస్తున్న సమయంలో పేలుడు సంభవించిందన్నారు. 2018లో బి.మఠం మండలం చంచయ్యగారిపల్లెకు చెందిన చిలేకాంపల్లె నాగేశ్వరరెడ్డి లీజుకు తీసుకుని ఆపరేటింగ్‌ చేస్తూ వస్తున్నాడని, అయితే ఆ సమయంలో వీరు కొన్ని నిబంధనలు పాటించలేదన్నారు. మైనింగ్‌ లైసెన్సు లేక కొన్ని నిబంధనలు కూడా పాటించడం లేదని, పేలుడు సమయంలో బాక్సులు తీసుకువచ్చిన మేనేజరు కూడా మృతి చెందాడని ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తున్నామన్నారు. అలాగే మైనింగ్‌ శాఖకు కూడా ఘటనపై లైసెన్సు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనుమతులు ఉన్నాయో కూడా నివేదిక పంపిస్తున్నామన్నారు. పేలుడు జరిగిన రోజు ఉదయమే పులివెందుల నుంచి పేలుడు పదార్థాలను తీసుకెళ్లారని తెలిపారు. ఈ ఘటనపై లీజుదారుడు, ఆయన మేనేజరును పూర్తి స్థాయిలో విచారిస్తున్నామన్నారు. మైనింగ్‌కు సంబంధించి పర్యావరణ అనుమతులు లేవని, మైనింగ్‌లో బ్లాస్టింగ్‌కు కూడా అనుమతులు లేవన్నారు. కాగా ఘటన పట్ల అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - 2021-05-11T05:38:50+05:30 IST