కిషన్రెడ్డి- కేటీఆర్ మధ్య Tweet War..
ABN , First Publish Date - 2021-12-21T12:08:16+05:30 IST
కిషన్రెడ్డి- కేటీఆర్ మధ్య Tweet War..
హైదరాబాద్ సిటీ/సికింద్రాబాద్ : కంటోన్మెంట్ బోర్డు పరిధిలో రహదారుల మూసివేతపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రి కే. తారక రామారావుల మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. కంటోన్మెంట్లో రోడ్లు మూసివేయడం వల్ల సాధారణ పౌరులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రులు రాజ్నాథ్సింగ్, కిషన్రెడ్డిలను ట్యాగ్ చేస్తూ ఈ నెల 18న కేటీఆర్ ట్వీట్ చేశారు. లోకల్ మిలిటరీ అథారిటీ (ఎల్ఎంఏ) నిబంధనలు ఉల్లంఘిస్తూ పౌరులను పెడుతున్న ఇబ్బందులపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. గ్రీన్ సైనిక్పురి పేరుతో ఉన్న వీడియోను కేటీఆర్ పోస్ట్ చేశారు.
‘కంటోన్మెంట్లో రోడ్ల మూసివేతకు సంబంధించి మీ జూనియర్ మినిస్టర్కు అవగాహన లేనట్టుంది. 21 రహదారులు మూసేస్తే, పార్లమెంట్లో రెండు రోడ్లని సమాధానమిచ్చారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కనీస వసతులు కల్పించలేకపోతే జీహెచ్ఎంసీలో విలీనం చేయండి’ అని రాజ్నాథ్సింగ్ను ట్విట్టర్లో కోరారు. దీనిపై మీడియా సమావేశంలో కిషన్రెడ్డి స్పందించారు. రోడ్ల వివరాలుంటే ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ‘ఇక్కడ జాబితా ఉంది. రోడ్లను వెంటనే ఓపెన్ చేసేలా చర్యలు తీసుకుని లక్షలాది పౌరులకు మేలు చేస్తారని భావిస్తున్నా’ అని పేర్కొన్నారు.