చనిపోయిన బాలికను తల్లితో కలిపిన టీవీ చానెల్!

ABN , First Publish Date - 2020-02-13T02:28:21+05:30 IST

దాదాపు నాలుగేళ్ల క్రితం మరణించిన కుమార్తెను ఆ తల్లి తలచుకోని రోజంటూ లేదు.

చనిపోయిన బాలికను తల్లితో కలిపిన టీవీ చానెల్!

సియోల్: దాదాపు నాలుగేళ్ల క్రితం మరణించిన కుమార్తెను ఆ తల్లి తలచుకోని రోజంటూ లేదు. ప్రతిరోజూ కుమార్తెను తలచుకొని కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటుంది. అలాంటి ఆమెకు ఓ టీవీ చానెల్ గొప్ప అవకాశం ఇచ్చింది. ‘మీ కుమార్తెతో కలిసే అవకాశం కల్పిస్తాం’ అని చెప్పింది. ఆ మాటతో షాకైన జాంగ్ జీ సుంగ్.. వారి వెంట స్టూడియోకు వెళ్లింది. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొంది. దానిలో భాగంగా మరణించిన తన కుమార్తెను కలిసింది. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే కచ్చితంగా ఇది చదవాల్సిందే.



దక్షిణ కొరియాకు చెందిన జాంగ్ జీ సుంగ్‌కు నాయోన్ అనే కుమార్తె ఉండేది. 2016లో అనారోగ్యానికి గురైన నాయోన్ మరణించింది. అప్పటి నుంచి సుంగ్.. కుమార్తె జ్ఞాపకాల్లోనే బతుకుతోంది. ఇదిలా ఉండగా మున్వా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(ఎంబీసీ)కి చెందిన కొందరు సుంగ్‌ను సంప్రదించారు. తాము ఓ డాక్యుమెంటరీ చిత్రిస్తున్నామని చెప్పారు. దానిలో భాగంగా మరణించిన వారిని వర్చువల్ రియాలిటీలో బతికిస్తున్నామని, తమ ‘మీటింగ్ యూ’ ప్రోగ్రాంలో పాల్గొంటే నాయోన్‌ను కూడా కలవొచ్చని చెప్పారు. ప్రేమించిన వారిని కోల్పోయిన చాలామందికి ఇలా మానసిక శాంతి కలుగుతుందని వివరించారు. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సుంగ్ అంగీకరించింది. ఆ తర్వాత ఎంబీసీ స్టూడియోకు వెళ్లి, వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్, గ్లౌస్ ధరించి తన కుమార్తెను కలిసింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత నాయోన్, సుంగ్ ఓ వర్చువల్ తోటలో కలిశారు.


అక్కడ తన కుమార్తెను చూసిన సుంగ్ కళ్ల నిండా నీళ్లతో.. ‘నా బంగారం, ఎంతగా గుర్తొచ్చావో’ అంటూ నాయోన్ తలనిమిరింది. పర్పుల్ గౌన్ వేసుకున్న నాయోన్.. ‘నేను నీకు గుర్తొస్తున్నానా అమ్మా’ అని అడిగింది. దీనికి బదులుగా, ఎప్పుడూ కుమార్తె గురించే ఆలోచిస్తున్నట్లు సుంగ్ చెప్పింది. తను కూడా తల్లిని చాలా మిస్సయ్యానని చెప్పిన నాయోన్.. తన చెయ్యిపట్టుకోవాలని సుంగ్‌ను కోరింది. అప్పుడు కుమార్తె చెయ్యందుకున్న సుంగ్ ఆ తోటలో కాసేపు నడిచింది. ఆ తర్వాత తను బాగానే ఉన్నానని చెప్పిన నాయోన్.. అలసిపోయానంటూ పడుకుంది. దీంతో వర్చువల్ ప్రపంచం నుంచి బయటకొచ్చిన సుంగ్.. మొఖాన్ని చేతుల్తో కప్పుకొని ఏడ్చేసింది. తనలాంటి ఎంతోమందికి ఈ వర్చువల్ రియాలిటీ ఓదార్పునిస్తుందని చెప్పింది. నాయోన్ రూపురేఖలు, కంఠాన్ని సాధ్యమైనంత వాస్తవికంగా ఉండేలా ఈ ప్రోగ్రాం సృష్టించామని ఎంబీసీ ప్రతినిధులు చెప్పారు. 


కాగా, ఇటువంటి మానసిక ప్రయోగాలు చేయడం మంచిదికాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇలాంటి ప్రయోగాలు వల్ల మంచికన్నా, చెడే ఎక్కువ జరుగుతుందని అంటున్నారు. ఈ విషయంలో సైకియాట్రిస్టులు కూడా తమతో ఏకీభవిస్తారని, ఇలా వర్చువల్ రియాలిటీని వాడుకొని మరణించిన వారిని బతికించడం తగదని చెప్పారు. అయినా టీఆర్పీ రేటింగ్స్ కోసం ఇలాంటి ప్రయోగం ఎలా చేశారంటూ ఎంబీసీ సంస్థపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Video Source: MBClife

Updated Date - 2020-02-13T02:28:21+05:30 IST