మూడేళ్లుగా పెరగని పసుపు ధర
ABN , First Publish Date - 2021-01-24T04:54:20+05:30 IST
నిజామాబాద్ జిల్లా నుంచి పసుపు ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నా గడిచిన మూడేళ్లుగా ధర మాత్రం పెరగడం లేదు. ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి పెరగడం.. ఎక్కువ మంది రైతులు పసుపు సాగుకు మొగ్గుచూపడంతో ఆశించిన స్థాయిలో ధర రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించకపోవడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు.
ఇతర రాష్ట్రాలు, దేశాల్లోనూ భారీగా పెరుగుతున్న పసుపు సాగు
ఉత్పత్తి పెరిగి.. డిమాండ్ తగ్గడంతో ఆశించిన స్థాయిలో రాని రేటు
మద్దతు ధర కల్పించాలని కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్న రైతులు
నిజామాబాద్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్ జిల్లా నుంచి పసుపు ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నా గడిచిన మూడేళ్లుగా ధర మాత్రం పెరగడం లేదు. ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి పెరగడం.. ఎక్కువ మంది రైతులు పసుపు సాగుకు మొగ్గుచూపడంతో ఆశించిన స్థాయిలో ధర రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించకపోవడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఈ యేడాది పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కల్పించడం లేదు. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పోటీ ఉండడం వల్ల ధర పెరగడం లేదని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ ఉందని, ప్రస్తుతం దిగుబడి పెరగడం వల్ల ధర రావడం లేదని వారు తెలిపారు. రైతులు మాత్రం మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
నిజాంకాలం నుంచి సాగు
జిల్లాలో నిజాం కాలం నుంచి రైతులు పసుపును సాగు చేస్తున్నారు. ప్రతి యేటా సగటున 35 వేల నుంచి 50 వేల ఎకరాల మధ్య పంటను సాగు చేస్తున్నారు. ఈ యేడాది కూడా 45 వేల ఎకరాలకుపైగా వేశారు. జిల్లాతో పాటు నిర్మల్లో 19 వేల ఎకరాలు, జగిత్యాలలో 31 వేలు, వరంగల్లో 15వేలు, మహబూబాబాద్లో 11 వేలు, భూపాలపల్లిలో 7 వేలు, వికారాబాద్లో 4,200 ఎకరాలు సాగు చేశారు. అత్యధికంగా ప్రతీ సంవత్సరం నిజామాబాద్ జిల్లాలోనే పసుపును సాగుచేస్తున్నారు. ఇందుకు గాను ఎకరాకు రూ.లక్షా 20 వేల నుంచి రూ.లక్షా 40 వేల మధ్య పెట్టుబడి పెడుతున్నారు.
ఇతర దేశాలకు ఎగుమతి
జిల్లా నుంచి గల్ఫ్, యూరప్ దేశాలతో పాటు ఇరాన్, బంగ్లాదేశ్కు పసుపును ఎగుమతి చేస్తున్నారు. ప్రతి యేటా ఎగుమతులు పెరుగుతున్నా ధర మాత్రం పెరగడం లేదు. రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో పసుపును ఎక్కువగా సాగుచేస్తున్నారు. దేశంలో 2012 సంవత్సరంలో 40 లక్షల బ్యాగుల పసుపు దిగుమతి రాగా.. ప్రసస్తుతం కోటి బ్యాగులకుపైగా వస్తోంది. దిగుబడి తక్కువ వచ్చిన సమయంలో డిమాండ్ పెరిగి ధర బాగా వచ్చింది. ప్రస్తుతం ఉత్పత్తి పెరిగి విస్తీర్ణం పెరగడం వల్ల ధర రావడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. గతంలో ఎనిమిదేళ్ల క్రితం క్వింటాలు పసుపు రూ.15 వేల వరకు విక్రయాలు జరగగా.. ప్రస్తుతం రూ.6 వేలకు మించడం లేదు. నిజామాబాద్ మార్కెట్కు ప్రతీ సంవత్సరం 20లక్షల బ్యాగులకుపైగా పసుపు విక్రయానికి వస్తుంది. రైతులు మాత్రం ప్రస్తుతం వస్తున్న ధర సరిపోవడం లేదని వారంటున్నారు. క్వింటాలు రూ.4 వేల నుంచి రూ.6 వేల మధ్య అమ్మకాలు జరపడం వల్ల తమకు నష్టం వస్తోందని పేర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు కల్పించాలని రైతులు కోరుతున్నారు. ఆ రాష్ట్రంలో క్వింటాలు రూ.6,800కు ఉంటు ందన్నారు. అదే స్థాయిలో రాష్ట్రంలోనూ కల్పించాలని కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కష్టానికి తగ్గ ఫలితం లేదు
బద్దం తిరుపతిరెడ్డి, ఉప్లూర్, కమ్మర్పల్లి
ప్రతియేటా పసుపును సాగు చేస్తున్నా.. కష్టానికి తగ్గ ఫలితం ఉండడం లేదు. ఎకరాకు రూ.లక్షా 20 వేల వరకు పెట్టుబడి పెడుతున్నా.. దిగుబడి తగ్గి లాభాలు రావడం లేదు. మార్కెట్లో ధర తక్కువగా ఉండడం వల్ల పెట్టుబ డి కూడా రావడం లేదు. గతంలో క్వింటాలు పసుపు రూ.8 వేల నుంచి రూ.15 వేల మధ్య విక్రయించగా.. ప్రస్తుతం రూ.4 వేల నుంచి రూ.6 వేల మధ్యే పలుకుతోంది. దీంతో ఏ రైతుకూ గిట్టుబాటు కావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు సుగంధ ద్రవ్యాల బోర్డుతో సంబంధం లేకుండా ప సుపు బోర్డును ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి.
పసుపునకు మద్దతు ధర కల్పించాలి
పడిగెల ప్రవీణ్, హసాకొత్తూర్
గడిచిన పదేళ్లుగా పసుపునకు మద్దతు ధర రావడం లేదు. రైతు లు ఎన్ని ఆందోళనలు చేసినా ప్ర భుత్వాలు పట్టించుకోవడం లేదు. పదేళ్ల క్రితం క్వింటాలు రూ.15 వే లకు విక్రయించాం. ప్రస్తుతం రూ.4,500 నుంచి రూ.5 వేల మ ధ్య వస్తోంది. రాజకీయ నాయకు లు ఓట్ల సమయంలో హామీలిచ్చి వదిలివేస్తున్నారు. ప్రభుత్వం పసుపునకు మద్దతు ధర నిర్ణయించి రైతులను ఆదుకోవాలి. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వమే పసుపును కొనుగోలు చేయాలి.
ఎగుమతులు పెరిగినా డిమాండ్ లేదు..
కమల్ ఇనాని, పసుపు వ్యాపారి
జిల్లా నుంచి ఇతర దేశాలకు పసుపు ఎగుమతులు పెరిగినా.. ధర మాత్రం పెరగడం లేదు. రా ష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు, దే శాల్లో కూడా పసుపు సాగు పెరగ డం వల్ల పోటీ ఏర్పడింది. దిగుబ డి కూడా బాగా పెరిగింది. దీని వ ల్ల వినియోగం కన్నా ఉత్పత్తి ఎ క్కువగా ఉండడం వల్ల పసుపున కు ధర రావడం లేదు.