హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (Bojjalagopalakrishnareddy) మృతి పట్ల టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. ఒక మంచి ఆప్తమిత్రుణ్ణి కోల్పోయానని తుమ్మల అన్నారు. నలబై ఏండ్లు రాజకీయాల్లో కలసి పని చేశామని చెప్పారు. బొజ్జల మరణం తనను కలచివేసిందని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) తెలిపారు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొంతకాలంగా అనారోగ్యంలో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గోపాలకృష్ణారెడ్డి srikalahasti constituency నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ సీఎం Chandrababu కాబినెట్లో ఆయన అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. అలిపిరి ఘటనలో చంద్రబాబుతో పాటు బొజ్జల కూడా గాయపడ్డారు. తీవ్ర అనారోగ్యంతో మూడు నెలలపాటు ఆస్పత్రిలో ఉన్న బొజ్జల ఇటీవలే కొంత కోలుకొని ఇంటికి తిరిగి వచ్చారు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో తిరిగి ఆయనను కుటుంబసభ్యులు అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించారు. తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, తెలంగాణ సీఎం కేసీఆర్ లతో బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి మంచి సంబంధాలున్నాయి. పార్టీలు మారినా కూడా వీరి మధ్య ఆ సంబంధాలు కొనసాగుతున్నాయి.
తెలంగాణ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తిరుపతికి తొలిసారిగా వచ్చిన సమయంలో చిత్తూరు నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మంత్రిగా ఉన్నారు. కేసీఆర్ తో కలిసి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీవారి దర్శించుకున్నారు. 1949 ఏప్రిల్ 15న శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో ఆయన జన్మించారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తండ్రి సుబ్బరామిరెడ్డి కూడా శ్రీకాళహస్తి నుంచి గతంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇదే అసెంబ్లీ స్థానం నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గెలుపొందారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 1968లో బీఎస్సీ డిగ్రీ పొందారు. 1972లో లా పట్టాను అందుకొన్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీలోనే ఆయన చదువుకున్నారు. కాంగ్రెస్ కు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి కూతురు బృందను బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వివాహం చేసుకొన్నారు. 1989లో బోజ్జల గోపాలకృష్ణారెడ్డి తొలిసారిగా శ్రీకాళహస్తి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1989లో టీడీపీ తరపున తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.1994,1999, 2009, 2014లలో కూడా ఆయన శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు.