రేపల్లె ఘటన.. సభ్య సమాజానికి సిగ్గు చేటు: తులసీ రెడ్డి
ABN , First Publish Date - 2022-05-02T17:47:59+05:30 IST
వైసీపీ పాలనలో రాష్ట్రం రేప్ల ఆంధ్రప్రదేశ్, నేరాంధ్రప్రదేశ్గా తయారైందని తులసీ రెడ్డి విమర్శించారు.
అమరావతి: వైసీపీ పాలనలో రాష్ట్రం రేప్ల ఆంధ్రప్రదేశ్, నేరాంధ్రప్రదేశ్గా తయారైందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రేపల్లె రైల్వేస్టేషన్లో భర్త కళ్లెదుటే ఓ మహిళపై ముగ్గురు కామాంధులు ఆత్యాచారం చేయడం సభ్య సమాజానికి సిగ్గు చేటన్నారు. నిందితులు తాగిన మైకంలో ఉన్నట్లు తెలుస్తోందని, నేరాలు జరిగిన అనేక సందర్భాలలో నేరస్థులు మద్యం సేవించడం, గంజాయి తదితర మత్తు పదార్థాల ప్రభావంలో ఉన్నట్లు తెలుస్తోందన్నారు.
ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని, మత్తు పదార్థాలను అరికట్టాలని తులసీ రెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా తయారైందని ఎద్దేవా చేశారు. పదోతరగతి తెలుగు, హిందీ, ఇంగ్లీషు ప్రశ్న పత్రాలు లీకయ్యాయని.. గతంలో ఒక్క ప్రశ్నపత్రం లీకు అయినందుకే నాటి విద్యాశాఖ మంత్రి స్వర్గీయ ముద్దు కృష్ణమనాయుడు మంత్రి పదవికి రాజీనామా చేశారని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి నైతిక విలువలు ఉంటే, ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి వెంటనే పదవులకు రాజీనామా చేయాలని తులసీ రెడ్డి డిమాండ్ చేశారు.