రైతుల పాలిట శాపంగా మారిన జగన్ పాలన: Tulasi Reddy
ABN , First Publish Date - 2021-11-09T20:07:30+05:30 IST
జగన్మోహన్ రెడ్డి పాలన రైతుల పాలిట శాపంగా మారిందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు.
కడప జిల్లా: జగన్మోహన్ రెడ్డి పాలన రైతుల పాలిట శాపంగా మారిందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శించారు. మంగళవారం కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అతివృష్టివల్ల రైతులు అంతకంటే ఎక్కువ నష్టపోతున్నారన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట మొత్తం నేలకొరిందని, ఒక్క వడ్లగింజ కూడా చేతికొచ్చే పరిస్థితిలేదన్నారు. దాదాపు ఎకరాకు రూ. 30 వేలు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాటలు చెప్పకుండా వెంటనే నివేదికలు తెప్పించుకుని రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు.