మరో గండం
ABN , First Publish Date - 2020-12-03T06:50:21+05:30 IST
నివర్ తుఫాన్ దెబ్బ నుంచి ఇంకా తేరుకోని రైతులకు బురేవి రూపంలో మరో టెన్షన్ మొదలైంది.
రైతుల్లో బురేవి టెన్షన్
నివర్ దెబ్బ నుంచి తేరుకోని పంటలు
ఇంకా నీటిలోనే వేలాది ఎకరాలు
ఒంగోలు, డిసెంబరు 2 (ఆంఽద్రజ్యోతి): నివర్ తుఫాన్ దెబ్బ నుంచి ఇంకా తేరుకోని రైతులకు బురేవి రూపంలో మరో టెన్షన్ మొదలైంది. బంగాళాఖాతంలో తమిళనాడు-శ్రీలంక మధ్య ఉన్న వాయుగుండం తుఫాన్గా మారి గురువారం తెల్లవారుజామున తీరం దాటనుంది. బురేవిగా దానికి పేరుపెట్టారు. కాగా బురేవి ప్రభావంతో గురు, శుక్ర వారాల్లో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందు తున్నారు. వారంక్రితం నివర్ ప్రభావం తీవ్రంగా చూపిన విషయం విదితమే. చాలా ప్రాంతాల్లో వేలాది హెక్టార్లలో పత్తి, మిర్చి, పొగాకు, మినుము, కంది, వరి వంటి పంట పొలాల్లో వర్షపునీరు అలాగే ఉంది. తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రస్తుతం బురేవి తుఫాన్ ప్రభావం కూడా ఉండనుందన్న సమాచారం మరింత ఆందోళన కలిగిస్తోంది. జిల్లావ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం నుంచే వాతావరణంలో మా ర్పు కనిపిస్తోంది. మళ్లీ ఒక మోస్తరు వర్షం కురిసినా మిగిలి ఉన్న కొద్దిపాటి పంటలూ చేతికొచ్చే అవకాశం ఉండదని రైతులు ఆవే దన చెందుతున్నారు. చేనేతలు, మత్స్యకారుల్లోనూ ఆందోళన నెలకొంది.