అసలైన ధర్మయుద్ధం ఆరంభం : టీటీవీ దినకరన్
ABN , First Publish Date - 2021-03-09T14:09:55+05:30 IST
అసలైన ధర్మయుద్ధం ఇప్పుడే ఆరంభమైందని అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం అధినేత టీటీవీ దినకరన్ ప్రకటించారు. ధర్మం తమవైపే వుందని, రాష్ట్ర ప్రజలు తమ పార్టీనే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు...
చెన్నై(ఆంధ్రజ్యోతి): అసలైన ధర్మయుద్ధం ఇప్పుడే ఆరంభమైందని అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం అధినేత టీటీవీ దినకరన్ ప్రకటించారు. ధర్మం తమవైపే వుందని, రాష్ట్ర ప్రజలు తమ పార్టీనే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాయపేటలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఉదయం ఆయన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరిపారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమ్మ (జయలలిత) ప్రభుత్వాన్ని మళ్ళీ నెలకొల్పేందుకు తమ పార్టీ పాటుపడుతోందని, తమ పార్టీ పోటీకి దిగటం వల్ల ఓట్లు చీలి ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే గెలిచే అవకాశం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రజలు తమ పార్టీని గెలిపిస్తారనే నమ్మకం తనకుందని చెప్పారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అర్హత కోల్పోయిన మాజీ శాసనసభ్యులందరూ అమ్మా మక్కల్ మున్నేట్రకళగం పాలక మండలిలలో సభ్యులుగా వున్నారని, వారి కోసమే తాను రాజకీయ పార్టీని ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడిందని దినకరన్ చెప్పారు. ఈ ఎన్నికల్లో వారిలో ఎంతమంది పోటీ చేస్తారనే విషయంపై త్వరలో ప్రకటన జారీ చేస్తానని తెలిపారు.