అందుబాటులోకి టీటీడీ పంచగవ్య ఉత్పత్తులు
ABN , First Publish Date - 2022-01-28T06:42:50+05:30 IST
తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద సంస్థ సహకారంతో టీటీడీ తయారు చేయిస్తున్న 15 రకాల పంచగవ్య గృహ ఉత్పత్తుల అమ్మకాలు తిరుమలలో గురువారం ప్రారంభమయ్యాయి.
తిరుపతి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద సంస్థ సహకారంతో టీటీడీ తయారు చేయిస్తున్న 15 రకాల పంచగవ్య గృహ ఉత్పత్తుల అమ్మకాలు తిరుమలలో గురువారం ప్రారంభమయ్యాయి.తిరుపతిలో టీటీడీకి చెందిన డీపీడబ్ల్యు స్టోర్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ టీటీడీ గోశాలల్లోని పశువుల నుంచి సేకరించిన పంచగవ్యాలతో ఈ ఉత్పత్తులను తయారు చేయిస్తున్నట్టు తెలిపారు. అగరబత్తులను భక్తులు విరివిగా కొంటున్నందున వాటి ఉత్పత్తిని మరింత పెంచనున్నామన్నారు. డ్రైఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేస్తున్న కళాకృతులు కూడా ఇకపై భక్తులకు అందుబాటులో ఉంటాయన్నారు.టీటీడీ ఈవో జవహర్ రెడ్డి మాట్లాడుతూ నమామి గోవింద బ్రాండ్ పేరుతో టీటీడీ తయారు చేయిస్తున్న సోపు, షాంపు, టూత్ పౌడర్, ఫ్లోర్ క్లీనర్, ఫేస్ ప్యాక్, సాంబ్రాణి, పిడకల వంటి 15 రకాల ఉత్పత్తులు తిరుమలలో విక్రయానికి అందుబాటులో ఉంటాయన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ, ఏపీల్లో జిల్లాకు రెండు గోశాలలను ఏర్పాటు చేసి, అక్కడి యువతకు పంచగవ్య ఉత్పత్తులపై శిక్షణ ఇస్తామన్నారు. తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి , టీటీడీ పాలకమండలి సభ్యుడు అశోక్ కుమార్ పాల్గొన్నారు.