కలెక్టర్ పరిఽధిలోకి టీటీడీ అతిథి గృహాలు: ఈవో
ABN , First Publish Date - 2021-04-21T06:37:02+05:30 IST
తిరుపతిలో కొవిడ్ ఉధ్రుతి నేపథ్యంలో టీటీడీకి చెందిన శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలను కలెక్టర్ పరిధిలో ఉంచాలని అధికారులను టీటీడీ ఈవో జవహర్రెడ్డి ఆదేశించారు.
తిరుపతి, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో కొవిడ్ ఉధ్రుతి నేపథ్యంలో టీటీడీకి చెందిన శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలను కలెక్టర్ పరిధిలో ఉంచాలని అధికారులను టీటీడీ ఈవో జవహర్రెడ్డి ఆదేశించారు. మంగళవారం టీటీడీ పరిపాలనా భవనంలో కొవిడ్ నియంత్రణ, చికిత్సలపై సమీక్షించారు. కలెక్టర్ హరినారాయణన్, కార్పొరేషన్ కమిషనర్ గిరీష, జేసీ వీరబ్రహ్మం, జేఈవో సదాభార్గవి, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, ఇన్చార్జ్ సీఎంవో మురళీధర్, స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ, డీఎంహెచ్వో పెంచలయ్య తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈవో మాట్లాడుతూ.. స్విమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ను కోరారు. ఆయుర్వేద ఆస్పత్రిని కూడా కొవిడ్ బాధితులకు వినియోగించాలన్నారు. అవసరమైతే అక్కడ అదనపు సిబ్బందిని ప్రభుత్వం తరఫున సమకూర్చుకోవాలన్నారు. టీటీడీ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రస్తుతం స్విమ్స్లో 450 కొవిడ్ బెడ్స్ ఉన్నాయని, అక్కడ ఐదో అంతస్తులో అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసి కొవిడ్ బాధితులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. గురువారం నుంచి శ్రీనివాసం అతిథిగృహంలో కొవిడ్ కేర్ సెంటర్ను అందుబాటులోకి తేనున్నట్టు కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. గత ఏడాది క్వారంటైన్ సెంటర్లలోనూ, ఆస్పత్రుల్లోనూ కొవిడ్ బాధితులకు టీటీడీ నిధులతో నాణ్యమైన భోజనం అందిందని, ఇప్పుడు కూడా అవసరమైన సరకులను అందించాలని ఈవోను కోరారు.