ప్రయాణికులకు టీఎస్‌‌ఆర్టీసీ మరో షాక్‌

ABN , First Publish Date - 2022-04-15T20:55:50+05:30 IST

త్వరలో మళ్లీ ఆర్టీసీ చార్జీలు పెరుగుతాయని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు.

ప్రయాణికులకు టీఎస్‌‌ఆర్టీసీ మరో షాక్‌

హైదరాబాద్‌: ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ మరో షాకిచ్చింది. టికెట్‌ రిజర్వేషన్‌ చార్జీలు టీఎస్‌‌ఆర్టీసీ పెంచింది. ఒక్కో రిజర్వేషన్‌పై రూ.20-30 పెంచారు. అయితే చార్జీలు పెంచిన విషయాన్ని ఆర్టీసీ యాజమాన్యం దాచింది. మార్చి 27 నుంచే పెంచిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. పెంచిన చార్జీలు అమల్లోకి వచ్చి మూడు వారాలు కావస్తున్నా టీఎస్ఆర్టీసీ అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. పెంచిన చార్జీల వివరాలను ఆర్టీసీ యాజమాన్యం రహస్యంగా ఉంచడాన్ని ప్రయాణికులు తప్పుబడుతున్నారు.


వారం రోజుల క్రితం డీజిల్‌ సెస్ పేరుతో టీఎస్‌ఆర్టీసీ చార్జీలను పెంచారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో 2 రూపాయలు.. ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో రూ.5 పెంచారు. డీజిల్‌ సెస్ పేరుతో పెరిగిన బస్సు చార్జీలు రేపటి నుంచి అమలులోకి వస్తాయి. అంతలోనే మరోసారి చార్జీలు పెంచి అందరికీ టీఆర్‌ఆర్టీసీ షాకిచ్చింది. నష్టాల ఊబి నుంచి కొంతైనా బయటపడేందుకుగాను ఆర్టీసీ అధికారులు చార్జీలు పెంచాలని భావించారు. వాస్తవానికి గత కొన్నేళ్లుగా ఆర్టీసీ నష్టాల్లో ఉంది. దీనికితోడు కరోనా కల్లోలం సృష్టించడంతో సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. దీనినుంచి బయటపడేందుకుగాను మార్చిలో రౌండప్‌ చార్జీలు, టోల్‌ సెస్‌, ప్యాసింజర్‌ సెస్‌ పేరిట 10 శాతానికిపైగా చార్జీలను పెంచింది.

Updated Date - 2022-04-15T20:55:50+05:30 IST