కరోనా బాధితుల సేవల్లోకి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌

ABN , First Publish Date - 2022-01-20T08:09:38+05:30 IST

రోనా మూడో దశ విజృంభిస్తున్న సూచనలు కనిపిస్తుండటంతో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మరోసారి బాధితుల సేవ కోసం రంగంలోకి దిగింది. మేనేజింగ్‌ ట్రస్టీ భువనేశ్వరి సూచనలతో బాధితుల కోసం సేవలు మళ్లీ ప్రారంభించారు...

కరోనా బాధితుల సేవల్లోకి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌

ఆన్‌లైన్‌లో వైద్య సూచనల సదుపాయం

అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): కరోనా మూడో దశ విజృంభిస్తున్న సూచనలు కనిపిస్తుండటంతో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మరోసారి బాధితుల సేవ కోసం రంగంలోకి దిగింది. మేనేజింగ్‌ ట్రస్టీ భువనేశ్వరి సూచనలతో బాధితుల కోసం సేవలు మళ్లీ ప్రారంభించారు. ట్రస్ట్‌ సన్నద్ధతను ఆమె బుధవారం సమీక్షించి, కొన్ని సూచనలు చేశారు. మందులు, మెడికల్‌ కిట్లు, వైద్య పరికరాల లభ్యతను అడిగి తెలుసుకొన్నారు. ఆన్‌లైన్‌లో బాధితులకు వైద్య సలహాలు ఇవ్వడానికి ఒక వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. అమెరికాలోని ప్రవాసాంధ్ర వైద్యుడు డాక్టర్‌ లోకేశ్వరరావు నేతృత్యంలో ఈ బృందం పని చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం ఏడు గంటలకు జూమ్‌ కాల్‌ ద్వారా రోగులతో, వైద్యులు మాట్లాడి వైద్య సలహాలు ఇస్తారు. కేవలం టీడీపీ కార్యకర్తలకే కాక సాధారణ ప్రజలు కూడా ఈ సేవలను పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఆన్‌లైన్‌లో సేవలు పొందలేని వారి కోసం 24 గంటలు పనిచేసే కాల్‌ సెంటర్‌ కూడా ఏర్పాటు చేస్తున్నారు. రోగులు ఎవరైనా సొంతంగా మందులు సమకూర్చుకోలేని పరిస్థితి ఉంటే వారికి ట్రస్ట్‌ ద్వారా మందులు అందిస్తారు. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను కూడా సిద్ధం చేశారు. కుప్పం, టెక్కలి, మహబూబాబాద్‌ జిల్లా గూడూరులో ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో కుప్పం ప్లాంట్‌ను ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. మిగిలిన రెండు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. పోయిన సంవత్సరం రూ.1.75 కోట్ల ఖర్చుతో ట్రస్ట్‌ కరోనా బాధితులకు వివిధ సేవలతోపాటు, ఆహారాన్ని కూడా వలంటీర్లతో అందించింది. 

ఏపీలో పదివేలు దాటిన కేసులు

అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రోజువారీ కేసులు ఏకంగా 10 వేల మార్కును దాటేశాయి. పాజిటివిటీ రేటు 24.1 శాతానికి చేరిందని బుధవారం విడుదల చేసిన బులెటిన్‌లో ఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా గత 24గంటల్లో 41,713 మందికి పరీక్షలు నిర్వహించగా 10,057 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. కరోనాతో మరో ఎనిమిది మంది మరణించడంతో రాష్ట్రంలో  మరణాలు 14,522కు పెరిగాయి. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో కలిపి 44,935 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Updated Date - 2022-01-20T08:09:38+05:30 IST