సరైన పాయింట్ ఉంది.. ఈపీ వేసుకోండి !
ABN , First Publish Date - 2021-10-20T08:53:05+05:30 IST
సరైన పాయింట్ ఉంది.. ఈపీ వేసుకోండి !
తుక్కుగూడ మునిసిపల్ చైర్మన్ ఎన్నిక కేసులో హైకోర్టు
హైదరాబాద్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): తుక్కుగూడ మునిసిపల్ చైర్మన్ ఎన్నికను రద్దు చేసే విషయంలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. ఎలక్షన్ పిటిషన్ (ఈపీ) వేసుకోవడానికి సరైన పాయింట్ ఉందని.. ఈ మేరకు ఎలక్షన్ ఫోరాన్ని ఆశ్రయించాలని సూచించింది. తుక్కుగూడ మునిసిపల్ చైర్మన్ మధు మోహన్ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ రాచ లక్ష్మణ్, జీ కృష్ణా గౌడ్ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై విచారించిన చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ఈమేరకు సూచన చేసింది. పిటిషనర్ పేర్కొన్న ఎన్నిక వల్ల నష్టపోయిన బాధిత వ్యక్తులు ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. పిల్ రూపంలో ఎన్నికల కేసును విచారించాల్సిన అవసరం లేదని.. ఎలక్షన్ ఫోరం రూపంలో సరైన ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు హైకోర్టు ఎందుకు విచారణ చేపట్టాలని ప్రశ్నించింది. ఎక్కువచోట్ల ఓటు వేయడం అనేది ఎలక్షన్ పిటిషన్ వేసుకోవడానికి సరైన పాయింట్ అని వ్యాఖ్యానించి, వ్యాజ్యం విచారణను ముగించింది.