కేన్సర్ చికిత్సలో పసుపు సాయం
ABN , First Publish Date - 2022-01-21T09:01:48+05:30 IST
కేన్సర్ చికిత్సలో పసుపు సాయం
సీసీఎంబీ శాస్త్రజ్ఞుల ఆర్ఎన్ఏఐ చికిత్స
హైదరాబాద్ సిటీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): కేన్సర్ కణితులను సమర్థంగా తగ్గించే..ఆర్ఎన్ఏఐ చికిత్సను సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రజ్ఞులు పసుపులోని కర్క్యుమిన్ సాయంతో అభివృద్ధి చేశారు. సీసీఎంబీకి చెందిన డాక్టర్ లేఖ దినేశ్కుమార్, ఆమె బృందం, సీఎ్సఐఆర్-ఎన్సీఎల్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్-నేషనల్ కెమికల్ లేబొరేటరీ)లోని పాలిమర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం సాయంతో.. ఆర్ఎన్ఏఐ మాలిక్యూల్స్ను ఎన్క్యాప్సులేట్ చేసే నానో కర్క్యుమిన్ స్ట్రక్చర్స్ను అభివృద్ధి చేశారు. సాధారణంగా కేన్సర్ బాధితులకు కీమో ఔషధాలను ఇస్తారు. కానీ, వాటివల్ల దుష్ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటికి బదులుగా, ఆర్ఎన్ఏ ఇంటర్ఫియరెన్స్ (ఆర్ఎన్ఏఐ) అనే జీన్ సైలెన్సింగ్ విధానంలో కేన్సర్కు చికిత్సా విధానాలను కనుగొనడంపై శాస్త్రజ్ఞులు చాలాకాలంగా దృష్టిసారించారు. ప్రతిపాదన వరకూ బాగానే ఉన్నా.. ఆర్ఎన్ఏఐ మాలిక్యూల్స్ను సురక్షితంగా, అదే సమయంలో ప్రభావవంతంగా ప్రవేశపెట్టడమే అతి పెద్ద సమస్య. ఆ ఎన్క్యాప్సులేషన్ సవాల్ను లేఖ బృందం నానో కర్క్యుమిన్ స్ట్రక్చర్స్ ద్వారా అధిగమించింది. ఈ బయో ఔషఽ దం.. విషపూరితం కానిదని, పెద్దపేగు, రొమ్ము కేన్సర్ల కణితులను సమర్థంగా తగ్గించలగలదని ఎలుకలపై ప్రయోగాల్లో నిరూపితమైనట్టు వారు పేర్కొన్నారు. కేన్సర్ నిరోధక, వాపు నిరోధక గుణాలు కలిగిన ‘కర్క్యుమిన్’ను ఆర్ఎన్ఏఐతో వాడితే పెద్దపేగు, రొమ్ము కేన్సర్ కణితులు తగ్గుతున్నట్టు లేఖ వెల్లడించారు. నానోస్కేల్ జర్నల్లో వీరి పరిశోధన ఫలితాలు ప్రచురితమయ్యాయి.