శివార్లో లగ్జరీ విల్లాలు
ABN , First Publish Date - 2020-08-12T09:18:42+05:30 IST
శివార్లో లగ్జరీ విల్లాలు
సురక్షితం, సౌకర్యవంతం అని సంపన్నుల్లో భావన
లాక్డౌన్లోనూ శివారులో డిమాండ్
రూ.5-12 కోట్ల దాకా అందుబాటులో
ఇదే సరైన సమయమంటున్న రియల్ ఎస్టేట్ నిపుణులు
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): కరోనాతో ఉద్యోగులు, వ్యాపారుల ఆదాయం బాగా పడిపోవడంతో ఇళ్లు, స్థలాల కొనుగోలుకు డిమాండ్ లేదు. వైరస్ కారణంగా ఏర్పడిన ఈ పరిస్థితి నుంచి హైదరాబాద్ శివార్లలోని లగ్జరీ విల్లాలకు మాత్రం మినహాయింపే! ఎందుకంటే.. సాధారణ రోజుల్లో కన్నా ప్రస్తుతం వీటికి డిమాండ్ పెరిగింది. లగ్జరీ విల్లా అంటే రూ.4-5 కోట్ల నుంచి రూ.10-12 కోట్ల దాకా ఉంటుంది. వైద్యులు, ఎన్నారైలు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు అభిరుచికి తగ్గట్లు ఇలాంటి విల్లాలను సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. లాక్డౌన్ తొలినాళ్లలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ చతికిలపడింది. చాలామంది కొత్త ఫ్లాట్ల కొనుగోలుకు దూరమయ్యారు. కానీ, లగ్జరీ విల్లాస్ కేటగిరిలో 4 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల ధరల స్థాయిలో ఉన్న స్థిరాస్తి వ్యాపారాలు ఊపందుకున్నాయని రియల్ ఎస్టేట్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. లాక్డౌన్లో ఇళ్ల అమ్మకాలు దశాబ్దపు కనిష్ఠానికి పడిపోయినా హైదరాబాద్లో 100పైగా ప్రీమియం లగ్జరీ గృహాలు అమ్ముడయ్యాయి.
ఐటీ కారిడార్ వైపే ఎక్కువ ఆసక్తి
హైదరాబాద్ పడమర దిక్కున ఐటీ కారిడార్ను ఆనుకుని ఉన్న గోపన్పల్లి, నార్సింగ్, కోకాపేట, మంచిరేవుల, గండిపేట, నానక్రాంగూడ వంటి ప్రాంతాల్లో డూప్లెక్స్, ట్రిపులెక్స్ విల్లాల ఖరీదు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పైనేగా ఉంటోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాలకు దగ్గరగా, ఐటీ కారిడార్లైన మాదాపూర్, గచ్చిబౌలి, నానక్రాంగూడలను అనుకొని ఉండటంతో డిమాండ్ ఉంది. ఔటర్రింగు రోడ్డుకు ఇరువైపులా ఉండటంతో మౌలిక వసతులు బాగున్నాయి. దీంతో సెంట్రల్ ఎయిర్ కండిషన్, స్విమ్మింగ్ పూల్, పూర్తిస్థాయి కిచెన్ సదుపాయాలు ఉన్న విల్లాల కొనుగోలుకు పలు రంగాల ప్రముఖులు ఆసక్తి చూపుతున్నారు. విదేశాల నుంచి తిరిగి వస్తున్నవారు ఈ ప్రాంతాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
మంచి తరుణం మించిన..
కరోనా పరిస్థితుల్లో విల్లాల కొనుగోలుకు ఇంతలా డిమాండ్ ఎందుకు పెరగడం ఏమిటనే సందేహం రావడం సహజమే! అయితే కరోనాకు ముందున్న ధరలతో పోల్చితే.. ప్రస్తుతం ధరలు తక్కువగా ఉన్నాయని, కరోనా తర్వాత ధరలు పెరగవచ్చునని కొనుగోలు దారులు భావిస్తున్నారు. దీంతో పలువురు రూ.4-10 కోట్ల బడ్జెట్తో విల్లాలను కొనుగోలు చేస్తున్నారు. ‘కొన్నాళ్లుగా స్థిరాస్తిని కొనేందుకు వెతుకుతున్నాను. కరోనా పరిస్థితుల్లో నగరం నుంచి కొంచెం దూరంగా ఉండటం మంచిదనిపించింది. ఓ లగ్జరీ విల్లాను కొన్నాను’ అని ఐటీ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒకరు పేర్కొన్నారు. నార్సింగి, కోకాపేట, గండి పేటల్లో అభిరుచులకు తగ్గట్టుగా విల్లాలు ఉన్నాయని తెలిపారు. ఉన్నత వర్గాల వారు శివారు ప్రాంతాల్లో విలాసవంతమైన నివాసాలను కోరుకుంటున్నారని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ హరీశ్ రెడ్డి తెలిపారు.