కూతురు కోసం లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించిన ట్రంప్ మాజీభార్య
ABN , First Publish Date - 2020-05-26T22:22:06+05:30 IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీభార్య మార్లా మేపుల్స్ తన
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీభార్య మార్లా మేపుల్స్ తన కూతురిని చూసేందుకు లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మార్లా మేపుల్స్, ట్రంప్కు పుట్టిన టిఫనీ ట్రంప్ ఇటీవల జార్జ్టౌన్ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ట్రంప్ కూడా తన కూతురిని చూస్తే గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. టిఫనీ ట్రంప్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సమయంలో మార్లా మేపుల్స్ న్యూయార్క్లో ఉండటం.. లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతుండటంతో కూతురి వద్దకు వెళ్లలేకపోయారు. అయితే తాజాగా ఆమె విమానంలో ఫేస్ మాస్క్తో ఉన్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ‘నేను భయాన్ని కాదు ప్రేమను ఎంచుకున్నాను’ అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చారు. అంతేకాకుండా బైబిల్లో ఉన్న వాఖ్యాలను కూడా రాశారు. మార్లా న్యూయార్క్ నగరం నుంచి వాషింగ్టన్లోని కూతురి దగ్గరికే వెళ్లినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. కరోనాకు న్యూయార్క్ కేంద్రంగా ఉన్న విషయం తెలిసిందే. న్యూయార్క్ వ్యాప్తంగా దాదాపు 30 వేల కేసులు నమోదయ్యాయి. లాక్డౌన్లో సడలింపులు ఇస్తున్నప్పటికి జూన్ 15 వరకు లాక్డౌన్ కొనసాగుతుందని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ వేరే రాష్ట్రాలకు ప్రయాణించవద్దని అన్నారు. ఇలాంటి సమయంలో మార్లా ఆంక్షలను ఉల్లంఘించి కూతురిని చూడటం కోసం వాషింగ్టన్కు వెళ్లారు. కాగా.. మార్లా, ట్రంప్ 1989లో కలుసుకున్నారు. 1993 డిసెంబర్లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత అంటే.. 1997లో వీరిద్దరూ విడిపోగా.. అధికారికంగా 1999లో విడాకులు పొందారు.