ఓడి గెలిచిన ట్రంప్
ABN , First Publish Date - 2020-02-08T10:08:54+05:30 IST
అమెరికా ప్రతినిధుల సభలో అభిశంసనకు గురైన ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగువ సభ సెనేట్లో అభిశంసన గండం నుంచి గట్టెక్కారు. దీనితో అయిదు నెలల నుంచి కొనసాగుతూ, రాజకీయ ప్రకంపనలు సృష్టించిన అభిశంసన ప్రక్రియకు
అమెరికా ప్రతినిధుల సభలో అభిశంసనకు గురైన ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగువ సభ సెనేట్లో అభిశంసన గండం నుంచి గట్టెక్కారు. దీనితో అయిదు నెలల నుంచి కొనసాగుతూ, రాజకీయ ప్రకంపనలు సృష్టించిన అభిశంసన ప్రక్రియకు తెరపడింది. ఈ ఏడాది జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయనకు మార్గం సుగమమైనట్లే. అధికారాన్ని దుర్వినియోగ పరిచారనే అభియోగాలతో పెట్టిన ఈ అభిశంసనను తన పార్టీకి మెజార్టీ గల సెనేట్లో ట్రంప్ సునాయాసంగానే నెగ్గుకు రాగలరని, ఆయన పదవికి గండం లేదని ముందు నుంచీ ఊహిస్తూ వచ్చిందే. అయితే, ఈ గెలుపు ఆయన నిర్దోషిత్వం వల్లనో, సచ్ఛీలత వల్లనో లభించింది కాదు. ఈ ఏడాది నవంబర్లో జరగాల్సిన అధ్యక్ష ఎన్నికల ముంగిట ఆ దేశంలోని ప్రధాన పక్షాలైన రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల ‘రాజకీయం’ వల్ల ఆయాచితంగా లభించినదిగానే భావించాలి.
ఈ ఏడాది నవంబర్లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున తనతో పోటీ పడనున్న జో బిడెన్ను దెబ్బతీయడానికి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారన్నది ట్రంప్పై మోపిన అభియోగం. జో కుమారుడు హంటర్ బిడెన్కు ఉక్రెయిన్లో వ్యాపారాలున్నాయి. హంటర్ను కేసుల్లో ఇరికించాలంటూ ట్రంప్ ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్స్కీపై ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఆదేశానికి సైనిక సాయంగా ప్రకటించిన నిధులు విడుదల చేయాలంటే తాను చెప్పిన పని చేయాల్సిందేనంటూ ట్రంప్ మెలిక పెట్టాడు. ఈ మేరకు ఆయనతో పలు మార్లు జరిపిన టెలిఫోన్ సంభాషణలను అమెరికా ఇంటెలిజెన్స్ అధికారి అయిన ప్రజావేగు ఒకరు బయటపెట్టడంతో చిచ్చురేగింది, వివాదం చెలరేగింది. అవన్నీ అవాస్తవాలంటూ, ఆధారం లేని ఆరోపణలంటూ ట్రంప్తో పాటు, ప్రభుత్వం, ఆయన మద్దతు దారులు ఖండనమండనలు చేశారు. సాక్ష్యాలంటూ కొన్ని సృష్టించారు. ప్రతిపక్షం, ట్రంప్ వ్యతిరేకులు కూడా ఏమాత్రం తగ్గకుండా ఇది క్విడ్ ప్రోకోనే, అధికార దుర్వినియోగమే అంటూ తీవ్రంగానే ధ్వజమెత్తారు.
ఇవిలా కొనసాగుతుండగానే అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ 2019 సెప్టెంబర్లో చట్టసభలో అభిశంసన ప్రక్రియ మొదలు పెట్టారు. విచారణలు, దర్యాప్తులు వంటి వన్నీ అయ్యాక డిసెంబర్లో ప్రతినిధుల సభలో ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగాలతో తెచ్చిన అభిశంసనపై ఓటింగు జరిగింది. ట్రంప్ అభిశంసనకు గురయ్యారు. అక్కడ నుంచి ఈ తీర్మానం ఎగువ సభ అయిన సెనేట్కు చేరింది. చర్చోపచర్చలు సాగిన అనంతరం ఫిబ్రవరి 5న ఓటింగు జరిగింది.
సెనేట్లో అభిశంసన తీర్మానం వీగిపోయింది అంటే, ట్రంప్ సచ్ఛీలుడని అర్థం కాదు. ఆయన గతం కానీ, అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచీ ఆయన తీసుకున్న నిర్ణయాలు, వివిధాంశాలపై వ్యాఖ్యలు, ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న తీరే ఆయన అహంభావాన్ని, దుందుడుకు తనాన్ని తెలియజేస్తున్నాయి. ఆ విధంగా ఆయన నైతికత మొదట్నుంచీ ప్రశ్నార్థకమే. సామాజిక విలువలను గానీ, ప్రజాస్వామిక విలువలను గానీ ఆయన పెద్దగా ఖాతరు చేసినట్లుగా కనిపించరు. అందుకే, అభిశంసన ప్రక్రియ కొనసాగిన ఈ ఐదు నెలల కాలంలో అమెరికా సమాజంలో జరిగిన చర్చలలో, దేశ జనాభాలో దాదాపు సగం మంది ఏకాభిప్రాయం వెలిబుచ్చారు.
ఆరోపణలు నిజమైనా, కాకపోయినా ట్రంప్ను పదవీచ్యుతుడిని చేయాలనే కోరారు. సర్వేల్లోనూ అత్యధికులు ఇలాంటి మనోభావాన్నే వెల్లడించారు. కాంగ్రెస్ సభ్యుల్లోనూ, సొంత పార్టీలోనూ ఇదే అభిప్రాయం ఉన్నట్టు సమాచారం. కాకపోతే, రెండు ప్రధాన పార్టీల ప్రతినిధులూ ‘అభిశంసన’ను అడ్డుపెట్టుకుని తమ తమ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యూహాలు పన్నారు, అడుగులు వేశారు. ట్రంప్పై తమకు వ్యతిరేకత ఉన్నా కూడా, ఒక్క మిట్ రోమ్నీ తప్ప రిపబ్లికన్ పార్టీ సభ్యులు ఎవరూ ‘ఓటింగు’ సమయంలో దాన్ని బయట పడనీయలేదు. తమ శక్తినంతా ఒడ్డి అభిశంసనను ఓడించారు. ట్రంప్కు వ్యతిరేకంగా సాక్షులను కూడా సెనేట్కు అనుమతించలేదు. అభిశంసనను ఓడించడం ద్వారా ‘మా పార్టీలో దోషులెవరూ లేరు’ అని ప్రకటించుకుని, తరువాత ఆయనను దేశాధ్యక్ష బరిలోకి దిగకుండా పార్టీలో అభిశంసించాలని వ్యూహం పన్నారట. పదవీ గండం నుంచి గట్టెక్కిన సంతోషంలో సామాజిక మాధ్యమాల ద్వారానూ, ప్రత్యక్షంగానూ తన వాచాలతను మరింత దూకుడుగా ప్రదర్శిస్తున్న ట్రంప్ ఈ వ్యతిరేకతను అధిగమించి, ఎన్నికల బరిలోకి దిగుతాడా? దిగినా... పదవీచ్యుతి గండాన్ని ఎదుర్కొన్న తొలి అధ్యక్షుడిగా మచ్చబడ్డ ఆయనను ప్రజలు ఆదరించి మరోసారి గెలిపిస్తారా? అనేదే ఇప్పుడు అమెరికాకు సంబంధించిన ఆసక్తికరమైన అంశం.