లక్షకు చేరువవుతున్న మరణాల సంఖ్య.. గోల్ఫ్ ఆడుకుంటున్న అమెరికా అధ్యక్షుడు

ABN , First Publish Date - 2020-05-26T21:40:37+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాదాపు రెండు నెలల తరువాత గోల్ఫ్

లక్షకు చేరువవుతున్న మరణాల సంఖ్య.. గోల్ఫ్ ఆడుకుంటున్న అమెరికా అధ్యక్షుడు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాదాపు రెండు నెలల తరువాత గోల్ఫ్ ఆడుతూ కనిపించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. మరోపక్క అమెరికాలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య లక్షకు చేరువలో ఉంది. ఇలాంటి సమయంలో ట్రంప్ గోల్ఫ్ ఆడటంపై.. గోల్ఫ్ క్లబ్‌ నుంచి ట్వీట్స్ చేయడంపై విమర్శలొస్తున్నాయి. మెమొరియల్ డే వీకెండ్ సందర్భంగా ట్రంప్ తన సమయాన్ని గోల్ఫ్ ఆడుకునేందుకు కేటాయించారు. శని, ఆదివారాల్లో వర్జీనియాలోని స్టెర్లింగ్‌లో ఉన్న తన సొంత గోల్ఫ్ క్లబ్‌లో ట్రంప్ గడిపారు. మరోపక్క ట్రంప్‌పై డెమొక్రట్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ మండిపడ్డారు. దేశాధ్యక్ష పదవి అంటే గోల్ఫ్ క్లబ్ నుంచి ట్వీట్ చేయడం కాదని.. ప్రపంచంలోనే అత్యున్నతమైన నిర్ణయాలను బాధ్యతాయుతంగా తీసుకోవడమని ఆయన అన్నారు. అటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ట్రంప్ సిద్దంగా లేరన్నారు. కాగా.. తనపై వస్తున్న విమర్శలపై ట్రంప్ సోమవారం స్పందించారు. తనపై ఇటువంటి ప్రచారం జరుగుతుందని తనకు ముందే తెలుసని అన్నారు. తనపై దుష్ప్రచారం చేసే మీడియా సంస్థలు డెమొక్రట్ అభ్యర్థి జో బైడెన్ ఏం చేస్తున్నారో కూడా చెప్పాలని అన్నారు. అంతేకాకుండా మాజీ అధ్యక్షుడు ఒబామా గోల్ఫ్ క్లబ్‌లో గడిపిన విషయాల గురించి కూడా ప్రస్తావించాలని అన్నారు.‘అమెరికా అనేక సమస్యలతో బాధపడుతోంటే.. అధ్యక్షుడు ఒబామా గోల్ప్ ఆడుకుంటున్నారు’ అని 2014 అక్టోబర్‌లో ట్రంప్ ట్వీట్ చేశారు. ఆ తరువాత కూడా అనేక సార్లు ఒబామా గోల్ఫ్ ఆడటంపై ట్రంప్ పలు విమర్శలు చేశారు. 

Updated Date - 2020-05-26T21:40:37+05:30 IST