చైనా చేసిన దాన్ని అమెరికా ఎప్పటికీ మరిచిపోదు: ట్రంప్

ABN , First Publish Date - 2020-10-17T16:27:26+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు. శుక్రవారం ఫ్లోరిడాలోని ఒకాలాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ట్రంప్.. కరోనా విషయమై డ్రాగన్ కంట్రీపై దుమ్మెత్తిపోశారు.

చైనా చేసిన దాన్ని అమెరికా ఎప్పటికీ మరిచిపోదు: ట్రంప్

ఒకాలా(ఫ్లోరిడా): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు. శుక్రవారం ఫ్లోరిడాలోని ఒకాలాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ట్రంప్.. కరోనా విషయమై డ్రాగన్ కంట్రీపై దుమ్మెత్తిపోశారు. తమ దేశానికి ప్లేగు(కొవిడ్-19)ను పంపింది చైనానే అని చెప్పిన అధ్యక్షుడు... మా దేశానికి చైనా చేసిన దాన్ని అమెరికా ఎప్పటికీ మరిచిపోదన్నారు. "చైనాకు ఏమైందో ఇప్పటికీ చాలా మందికి తెలియదు. కొవిడ్ తర్వాత అక్కడి పరిస్థితులపై ఇప్పటికీ బయటి ప్రపంచానికి తెలియదు. యూఎస్‌కు ప్లేగు పంపిన వారి కంటే మేము ప్రస్తుతం చాలా బెటర్‌గా ఉన్నాం. త్వరగానే ఈ వైరస్ ప్రభావం నుంచి బయటపడ్డాం. కానీ ఈ పోరులో రెండు లక్షలకు పైగా అమెరికన్లను కోల్పోవడం బాధాకరం. మాకు వారు చేసిన దాన్ని ఎప్పటికీ మరిచిపోలేం" అని ర్యాలీలో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు. 


కరోనా వ్యాప్తి దేశాన్ని దెబ్బతీసే ముందు అమెరికాకు గొప్ప ఆర్థిక వ్యవస్థ ఉంది. ఈ వైరస్ 'ఒక తాత్కాలిక భయంకరమైన పరిస్థితి' అని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. మేము కలిసికట్టుగా పోరాడి వైరస్‌ను తోకముడిచేలా చేశాం. దేశంలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా వైరస్ వల్ల ఏర్పడిన భయంకర పరిస్థితులు ప్రస్తుతం అదుపులోకి వచ్చాయి. అగ్రరాజ్యంలో భయంకర పరిస్థితులకు కారణమైన చైనాను అమెరికా ఎప్పటికీ మరిచిపోదంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. 


ఇక ఈ ర్యాలీలో కూడా ట్రంప్ తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌‌ను మరోసారి తీవ్రంగా విమర్శించారు. డబ్ల్యూటీఓ‌లో చైనా సభ్యత్వానికి బైడెన్ మద్దతు తెలపడం నిజంగా చెత్త నిర్ణయమని అన్నారు. మొదటి నుంచి మాజీ ఉపాధ్యక్షులు చైనాకు అనుకూలంగా వ్యహారిస్తున్నారని మండిపడ్డారు. అందుకే బైడెన్ గెలిస్తే దేశంలోకి చైనాను ఆహ్వానించినట్లేనని చెప్పారు. మన ఉద్యోగాలను బైడెన్ చైనీయులకు కట్టబెట్టడం ఖాయమని ట్రంప్ జోస్యం చెప్పారు. అలాగే ఇటీవల బైడెన్ ప్రకటించిన కోటి మంది అక్రమ వలసదారులకు పౌరసత్వం విషయాన్ని కూడా ట్రంప్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇదిలాఉంటే... ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు, మరణాలతో మొదటి స్థానంలో ఉన్న యూఎస్‌లో ఇప్పటివరకు 80 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2 లక్షల 18 వేల మందిని ఈ మహమ్మారి కబళించింది.       


Updated Date - 2020-10-17T16:27:26+05:30 IST