అమెరికాలో తెరుచుకోనున్న ప్రార్థనా మందిరాలు..!?
ABN , First Publish Date - 2020-05-24T01:01:01+05:30 IST
అమెరికా వ్యాప్తంగా ఉన్న ప్రార్థనా మందిరాలను తెరవాలని అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ గవర్నర్లకు పిలుపునిచ్చారు. శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన మీడియా స
వాషింగ్టన్: అమెరికా వ్యాప్తంగా ఉన్న ప్రార్థనా మందిరాలను తెరవాలని అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ గవర్నర్లకు పిలుపునిచ్చారు. శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. గవర్నర్ల తీరును తప్పుబట్టారు. మద్యం దుకాణాలు, అబార్షన్ క్లినిక్లను అత్యవసర విభాగాలుగా గుర్తించిన గవర్నర్లు.. ప్రార్థనా మందిరాలను చిన్న చూపు చూశారని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల ప్రార్థనా మందిరాలను అత్యవసర ప్రదేశాలుగా గుర్తించి, వెంటనే తెరవాలని గవర్నర్లకు ట్రంప్ సూచించారు. కాగా.. కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. అమెరికాలో కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉండటంతో దేశ వ్యాప్తంగా డిజాస్టర్ డిక్లరేషన్ ప్రకటించారు. అయితే లాక్డౌన్ ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉండటంతో.. ఆంక్షలను ఎత్తేయడానికి ట్రంప్ సర్కార్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అమెరికా వ్యాప్తంగా ఉన్న ప్రార్థనా మందిరాలను తిరిగి తెరవాలని రాష్ట్ర గవర్నర్లకు సూచించారు. కాగా.. ఇప్పటి వరకు అమెరికాలో 16.47లక్షల మంది కరోనా బారినపడ్డారు. 97వేల మందికి పైగా కరోనా కాటుకు మరణించారు.