భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన ట్రంప్!

ABN , First Publish Date - 2020-09-30T23:45:11+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్‌పై రెండు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇండియాను మిత్ర దేశంగా, ప్రధాని నరేంద్రమోదీని మంచి మిత్రుడిగా పలుమార్లు అభివర్ణించిన ఆయన.. వాతావరణ కాలు

భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన ట్రంప్!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్‌పై రెండు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇండియాను మిత్ర దేశంగా, ప్రధాని నరేంద్రమోదీని మంచి మిత్రుడిగా పలుమార్లు అభివర్ణించిన ఆయన.. వాతావరణ కాలుష్యానికి కారణం భారత్ అని ఆరోపించారు. అంతేకాకుండా కొవిడ్ మరణాల సంఖ్యపై భారత ప్రభుత్వం కచ్చితమైన సమాచారం ఇవ్వడం లేదన్నట్లుగా మాట్లాడారు. వివరాల్లోకి వెళితే.. అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ 3న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా.. ఇరు పార్టీల అభ్యర్థులు మంగళవారం రోజు తొలి డిబెట్‌లో పాల్గొన్నారు. పలు అంశాలపై డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ వాదించుకున్నారు. ఈ సందర్భంగా డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్.. డొనాల్డ్ ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. కొవిడ్‌ను కట్టడి చేయడంలో ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అమెరికాలో 2లక్షల మంది ప్రాణాలు కోల్పోవడానికి ట్రంపే కారణం అని మండిపడ్డారు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఈ స్థాయిలో మరణాలు నమోదుకాలేదని విమర్శించారు.


దీంతో జోక్యం చేసుకున్న ట్రంప్... చైనా, రష్యా, భారత్‌లో కొవిడ్ కారణంగా ఎంత మంది చనిపోయారో మీకు తెలుసా? అని జో బైడెన్‌ను ప్రశ్నించారు. కరోనా మరణాల సంఖ్యపై.. భారత్ కచ్చితమైన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న వాతావరణ మార్పులపై.. ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్.. మరోసారి భారత్‌పై ఆరోపణలు చేశారు. రష్యా, చైనా, భారత్‌ల వల్లే.. అత్యధికంగా వాతావరణం కాలుష్యం జరుగుతుందన్నారు. ఈ మూడు దేశాలు.. కాలుష్య కారకాలను తీవ్ర స్థాయిలో గాలిలోకి విడుదల చేస్తున్నాయన్నారు. 


Updated Date - 2020-09-30T23:45:11+05:30 IST