విదేశీ విద్యార్థులకు గుడ్న్యూస్.. వెనక్కి తగ్గిన ట్రంప్ సర్కార్ !
ABN , First Publish Date - 2020-07-15T17:19:30+05:30 IST
ఆన్లైన్ తరగతులకి హాజరవుతున్న అమెరికాలోని విదేశీ విద్యార్థులు వారి దేశాలకు వెళ్లిపోవాలని ఈ నెల 6న ట్రంప్ సర్కార్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
వాషింగ్టన్ డీసీ: ఆన్లైన్ తరగతులకి హాజరవుతున్న అమెరికాలోని విదేశీ విద్యార్థులు వారి దేశాలకు వెళ్లిపోవాలని ఈ నెల 6న ట్రంప్ సర్కార్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. లేనిపక్షంలో యూనివర్శిటీ ప్రాంగణంలో విద్యాబోధన చేసే విశ్వవిద్యాలయాలకు మారాలని సూచించింది. దీంతో యూఎస్లో విద్యానభ్యసిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులు అయోమయంలో పడిపోయారు. అయితే, తాజాగా ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గింది. యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ (ఐసీఈ) ఆదేశాలను వెనక్కు తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించిందని మసాచుసెట్స్లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి అల్లీసన్ బురోగ్స్ వెల్లడించారు. దీంతో లక్షలాది అంతర్జాతీయ విద్యార్థులకు భారీ ఊరట లభించింది.
కాగా, కరోనా సంక్షోభం నేపథ్యంలో తరగతులు పూర్తిగా ఆన్లైన్లోకి మారిపోతే విదేశీ విద్యార్థులు యూఎస్ వదిలి వెళ్లిపోవాలన్న ట్రంప్ నిర్ణయాన్ని హార్వర్డ్, ఎంఐటీ, జాన్స్ హాప్కిన్స్ వంటి 200పైగా యూనివర్శిటీలు వ్యతిరేకించాయి. ట్రంప్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కాయి. దీంతో దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో 8 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీరికి ప్రపంచ టెక్ దిగ్గజాలైన గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ కూడా మద్దతుగా నిలిచాయి. ఈ ఒత్తిడికి తలొగ్గిన ట్రంప్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో లక్షలాది విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది.