ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలి
ABN , First Publish Date - 2022-08-11T06:36:54+05:30 IST
ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలి
భారతీనగర్, ఆగస్టు 10: తక్షణమే ట్రూఅప్ చార్జీలను రద్దు చేయాలని, ఎస్సీ ఎస్టీ వర్గాలకు రాయితీలను కొనసాగించాలని, కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు డి.కాశీనాథ్ డిమాండ్ చేశారు. నిత్యావసర ధరల భారంతో కృంగిపోతున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ట్రూ అప్ చార్జీల పేరుతో మరో షాక్ ఇచ్చిందని వారు విమర్శించారు. రింగ్ రోడ్డు సెంటర్లోని సీపీడీసీఎల్ కార్యాలయం వద్ద ట్రూఅప్ చార్జీల భారానికి నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈనెల నుంచి 36 నెలల పాటు యూనిట్కు 22 పైసలు చొప్పున ట్రూ అప్ చార్జీలు భారం వేస్తున్నారన్నారు. వినియోగదారులపై రూ.2900 కోట్లు భారం పడుతుందన్నారు. ఈ ఏప్రిల్ నుంచి స్లాబుల మార్పిడి, టారిఫ్ పెంపుదల పేరుతో రూ.1400 కోట్లు భారం వేశారన్నారు. ఎన్నికలకు మందు విద్యుత్ చార్జీలు పెంచబోమన్నారన్నారు. కానీ నేడు మాట తప్పి గత ప్రభుత్వాన్ని మించి విద్యుత్ భారాలను మోపుతున్నారన్నారు. అనంతరం సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డికి బాబూరావు, కాశీనాథ్ వినతిపత్రాన్ని ఇచ్చారు.