మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయం
ABN , First Publish Date - 2022-08-11T08:17:39+05:30 IST
నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
వజ్రోత్సవ వేడుకల్లో ప్రజలందరూ పాల్గొనాలి: ఎమ్మెల్సీ కవిత
కవాడిగూడ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి నల్లగొండ జిల్లా కంచుకోటగా ఉందని, ఇటీవల జరిగిన నాగార్జునసాగర్, హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేశామని కవిత పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాలను పురస్కరించుకొని బుధవారం దోమలగూడలోని భారత్ సౌట్స్ అండ్ గైడ్స్ పాఠశాలలో వనమహోత్సవ సంబరాలను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ చీఫ్ కమిషనర్, ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా... ఎమ్మెల్యే ముఠా గోపాల్, గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్రెడ్డిలతో కలిసి పాఠశాల ప్రాంగణంలో కవిత మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో కవిత మాట్లాడుతూ... వజ్రోత్సవ వేడుకల కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములై దేశభక్తిని చాటాలన్నారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన త్యాగధనుల జీవితాల గురించి పిల్లలకు చెప్పాలన్నారు.