టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి..: కేసీఆర్
ABN , First Publish Date - 2022-04-27T17:32:10+05:30 IST
టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆస్తి అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణకు టీఆర్ఎస్ ఒక రక్షణ కవచం అన్నారు..
హైదరాబాద్: టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆస్తి అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణకు టీఆర్ఎస్ ఒక రక్షణ కవచం అన్నారు. హైచ్ఐసీసీలో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో బుధవారం కేసీఆర్ మాట్లాడుతూ..రాష్ట్రానికి టీఆర్ఎస్ పెట్టని కోట అని..దాన్ని ఎవరూ బద్దలు కొట్టలేరని కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు, ఓటములు...గెలుపుల తర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఇప్పుడు దేశానికే రోల్ మోడల్గా పాలన సాగిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. 60 లక్షల మంది పార్టీ కార్యకర్తలతో..వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు ఉన్న పార్టీ ఒక్క టీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. తెలంగాణ ప్రజల కాపలాదారు టీఆర్ఎస్ పార్టీ అని, దేశంలో 10 ఉత్తమైన గ్రామాల్లో అన్ని తెలంగాణ పల్లెలే ఉన్నాయన్నారు. దేశంలో 20 ఉత్తమ గ్రామాల్లో కూడా 19 తెలంగాణవే ఉన్నాయని తెలిపారు. అవార్డులు, రివార్డులు రాని శాఖలు తెలంగాణలో లేనేలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించామని తెలిపారు. ఏ రంగం తీసుకున్నా అద్భుతమైన ఫలితాలను తెలంగాణ రాష్ట్రం సాధించిందని కేసీఆర్ తెలిపారు.