రోడ్డెక్కటానికి కారణం కేంద్రమే: ఎంపీ నామా
ABN , First Publish Date - 2021-11-12T22:31:51+05:30 IST
రాష్ట్రంలోని రైతులందరూ రోడ్డెక్కటానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనని ఎంపీ
ఖమ్మం: రాష్ట్రంలోని రైతులందరూ రోడ్డెక్కటానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. రైతులు పండించిన పంటను కేంద్రమే కొనుగోలు చేయాలని కోరుతూ టీఆర్ఎస్ ఆధ్యర్యంలో జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ వద్ద నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమంలో ఎంపీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో రైతాంగం పండించిన ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు.
గత ఏడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో హామీలను ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రాజెక్టులు లేవు, డబ్బులు లేవన్నారు. చెప్పిన మాట ప్రకారం రైతులకు అండగా ఉండేందుకు కేసీఆర్ నిరంతరం పోరాటం చేస్తున్నారన్నారు. సమస్యలపై పోరాడుతున్న సీఎం కేసీఆర్కు పార్టీలకతీతంగా అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎంపీగా పార్లమెంట్లో రైతు సమస్యలపై మాట్లాడుతానన్నారు. తెలంగాణ ఎంపీలందరికీ రైతుల సమస్యలపై రైతు పక్షాన పోరాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు.