TRS MLAకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం..

ABN , First Publish Date - 2021-07-30T13:39:36+05:30 IST

ప్రథమ వార్షికోత్సవానికి హాజరయ్యేందుకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది...

TRS MLAకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం..

  • ఉప్పల్‌ ఎమ్మెల్యేకు త్రుటిలో తప్పిన ప్రమాదం
  • మొదటి అంతస్తు నుంచి కింద పడ్డ లిఫ్ట్‌

హైదరాబాద్ సిటీ/ఉప్పల్‌ : లిఫ్ట్‌ ప్రమాద ఘటన నుంచి ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభా‌ష్‌రెడ్డి, బోడుప్పల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ సామల బుచ్చిరెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. మొదటి అంతస్తు నుంచి లిఫ్ట్‌ జారి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే సుభా‌ష్‌రెడ్డి, మేయర్‌ బుచ్చిరెడ్డి, మాజీ కార్పొరేటర్‌ పరమేశ్వర్‌రెడ్డిలతోపాటు లిఫ్ట్‌లో ఉన్న వారికి ఎలాంటి గాయాలూ కాలేదు. గురువారం ఉప్పల్‌ నల్లచెరువు కట్ట వద్ద ఉన్న శ్రీ హెల్త్‌కేర్‌ ఆస్పత్రి ప్రథమ వార్షికోత్సవానికి హాజరయ్యేందుకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. మొదటి అంతస్తులో కార్యక్రమం ముగించుకొని లిఫ్ట్‌లో రెండో అంతస్తుకు వెళ్తుండగా ఓవర్‌ లోడ్‌తోనే ఈ ప్రమాదం జరిగిందని ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు.


ఆ సమయంలో లిఫ్ట్‌లో ఎమ్మెల్యేతో సహా 9 మంది నాయకులు ఉన్నారు. అందరూ లిఫ్ట్‌ ఎక్కిన తర్వాత పైకి వెళ్లేందుకు బటన్‌ నొక్కగానే పైకి కదిలినట్లే కదిలి ఒక్కసారిగా కింద గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పడిపోయింది. దీంతో తేరుకున్న ఎమ్మెల్యే సుభా‌ష్‌రెడ్డి గన్‌మెన్‌లు వెంటనే లిఫ్ట్‌ ద్వారాన్ని తెరవడంతో అందరూ సురక్షితంగా బయటకు వచ్చారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో నిర్వహకులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో మల్కాజగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు లిఫ్ట్‌లో ఎక్కగా అత్యంత ఎత్తునుంచి లిఫ్ట్‌ కిందపడిపోవడంతో అప్పట్లో ఆయనకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తిన  విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.



Updated Date - 2021-07-30T13:39:36+05:30 IST