రామ మందిరం విరాళాల కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

ABN , First Publish Date - 2021-01-19T20:54:32+05:30 IST

రాష్ట్రంలో టీఆర్ఎస్ , బీజేపీ నాయకులు ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుకుంటుంటే మరోవైపు ఇదంతా తనకేమీ పట్టనట్టుగా

రామ మందిరం విరాళాల కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే  క్రాంతి కిరణ్

సంగారెడ్డి: రాష్ట్రంలో టీఆర్ఎస్ , బీజేపీ నాయకులు ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుకుంటుంటే  మరోవైపు ఇదంతా తనకేమీ పట్టనట్టుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్  మంగళవారం ఆందోల్ - జోగిపేటలో రామ భక్తుల భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా జరుగుతోన్న విరాళాల సేకరణలో భాగంగా మంగళవారం ఆందోల్ - జోగిపేటలో  కూడా రామ మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్  కార్యక్రమం నిర్వహించారు.


దీనిలో భాగంగా విరాళాల సేకరణ కోసం రామ భక్తులు పట్టణ పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఎవరూ ఊహంచిని విధంగా టీఆర్ఎస్ కు చెందిన స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కూడా ఈ ర్యాలీలో తన అనుచరులతో కలిసి పాల్గొన్నారు. పట్టణంలో ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరించారు. రామ మందిరం నిర్మాణానికి తన వంతుగా 11,111 రూపాయల విరాళం అందజేశారు.




రాష్ట్రం ప్రభుత్వం పై బీజేపీ నాయకులు సంజయ్, అరవింద్ తదితర నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తూ సీఎం కేసీఆర్ ను విమర్శిస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ నాయకులు కూడా  రాష్ట్రానికి నిధులు ఇవ్వడంలేదని మోడీ ప్రభుత్వంపై ప్రత్యారోపణలు చేస్తున్నారు. 

అలాగే ఆందోల్ లో కూడా ఎమ్మెల్యే క్రాంతిపై స్థానిక బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ కూడా గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలాంటి సమయంలో రామమందిర నిర్మాణం కోసం విరాళాలు సేకరించే కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రాంతి పాల్గొనడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనను పట్టణ ప్రజలు ఆసక్తిగా గమనించారు.

Updated Date - 2021-01-19T20:54:32+05:30 IST