టీఆర్ఎస్ పాదయాత్ర, ప్లెక్సీలతో కాంగ్రెస్ నిరసన
ABN , First Publish Date - 2022-05-23T06:12:26+05:30 IST
జిల్లాకేంద్రం భువనగిరి మునిసిపాలిటీలోని విపక్ష వార్డుల్లో టీఆర్ఎస్ పాదయాత్రలు కొనసాగుతున్నాయి. మరోవైపు ప్ల్లెక్సీలతో కాంగ్రెస్ నిరసనలు కొనసాగుతున్నాయి.
భువనగిరిలో పోటాపోటీ ప్రదర్శనలు
భువనగిరి టౌన్, మే 22: జిల్లాకేంద్రం భువనగిరి మునిసిపాలిటీలోని విపక్ష వార్డుల్లో టీఆర్ఎస్ పాదయాత్రలు కొనసాగుతున్నాయి. మరోవైపు ప్ల్లెక్సీలతో కాంగ్రెస్ నిరసనలు కొనసాగుతున్నాయి. బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న 12వ వార్డులో ఆదివారం టీఆర్ఎస్ నాయకులు విస్తృతంగా పాదయాత్ర చేశారు. సమస్యలు పరిశీలించి పరిష్కరిస్తామని మునిసిపల్ వైస్చైర్మన్ చింతల కృష్ణయ్య నాయకులకు హామీ ఇచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రాతినిథ్యం వహిస్తున్న 10, 26వ వార్డుల్లోని హెచ్బీకాలనీలో నెలకొన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి పరిష్కరించాలని కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు కట్టి నిరసన తెలిపారు. ఆ రెండు వార్డుల పరిధిలోని వివిధ సంఘాలు, పలు కుటుంబాలు చేసిన తీర్మానాలను ప్రదర్శిస్తూ కాంగ్రెస్ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్కుమార్, కౌన్సిలర్ ఈరపాక నర్సింహ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. ఎమ్మెల్యేకు ఓటు హక్కు ఉన్న వార్డు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా పాలకపక్షంగా ఉన్న టీఆర్ఎస్ వాటిని పరిష్కరించడంలో నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు.