పొర్లుదండాలు పెట్టిన టీఆర్ఎస్ కార్యకర్త సస్పెన్షన్
ABN , First Publish Date - 2021-12-04T08:09:14+05:30 IST
రోడ్డు బాగు చేసి, కాలుష్యాన్ని నియంత్రించాలని పొర్లుదండాలు పెట్టి, మోకాళ్లపై నడిచిన టీఆర్ఎస్ కార్యకర్తను ఆ పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది.
రోడ్డు బాగుచేయాలని నిరసన తెలపడంతో పార్టీ నిర్ణయం
తాండూరు రూరల్, డిసెంబరు 3: రోడ్డు బాగు చేసి, కాలుష్యాన్ని నియంత్రించాలని పొర్లుదండాలు పెట్టి, మోకాళ్లపై నడిచిన టీఆర్ఎస్ కార్యకర్తను ఆ పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతారం అనుబంధ గ్రామమైన దస్తగిరిపేట్కు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త బోయిని అమ్రేశ్.. రోడ్డు బాగు చేయాలంటూ వినూత్న రీతిలో నిరసన తెలిపిన విషయం విదితమే. బుధవారం తాండూరు అంతారం బస్స్టాప్ నుంచి తాండూరు పట్టణం వరకు ఆయన నిరసన చేపట్టారు. అంతారం నుంచి రోడ్డుపై మోకాళ్లపై నడిచాడు. కొద్దిదూరం కంకర రోడ్డుపై పొర్లు దండాలు పెడుతూ టీఆర్సీ క్లబ్కు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ అధిష్ఠానం అమ్రేశ్ను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అమ్రేశ్ను శుక్రవారం ఆ పార్టీ మండలాధ్యక్షుడు గుర్రంపల్లి రాందాస్ సస్పెండ్ చేశారు.