అభివృద్ధే టీఆర్ఎస్ విజయసోపానం
ABN , First Publish Date - 2020-11-30T05:27:51+05:30 IST
అభివృద్ధే టీఆర్ఎస్ విజయసోపానం
- సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడురు లక్ష్మీనర్సింహారెడ్డి
కడ్తాల్ : సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు విజయసోపానమని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడురు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు. స్వార్థ శక్తులు, అవకాశవాదులు ఎన్ని కుట్రలు పన్నినా మేయర్ పీఠం మళ్లీ టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ఆరేళ్ల పాలనలో హైదరాబాద్ అద్భుత ప్రగతి సాధించిందన్నారు. పారిశుధ్యం, శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి పెద్దపీట వేసినట్లు చెప్పారు. కరోనా నేపథ్యంలో ప్రజల ఇబ్బందులు గుర్తించి ఇంటి పన్ను 50 శాతం తగ్గించిందని గుర్తు చేశారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదన్నారు.