భారత్-బంగ్లాదేశ్ సత్సంబంధాలను దెబ్బతీసే కుట్ర : త్రిపుర సీఎం

ABN , First Publish Date - 2021-10-19T23:26:29+05:30 IST

భారత్-బంగ్లాదేశ్ మధ్య సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్న

భారత్-బంగ్లాదేశ్ సత్సంబంధాలను దెబ్బతీసే కుట్ర : త్రిపుర సీఎం

అగర్తల : భారత్-బంగ్లాదేశ్ మధ్య సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్న సత్సంబంధాలను దెబ్బతీసేందుకు ఛాందసవాదులు కుట్ర పన్నారని త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ ఆరోపించారు. బంగ్లాదేశ్‌లోని మైనారిటీలపై దాడులు భారీ కుట్రలో భాగమేనని పేర్కొన్నారు. ఈ దాడులపై బంగ్లాదేశ్ కఠిన చర్యలు తీసుకుంటుందనే నమ్మకం ఉందన్నారు. 


బిప్లబ్ దేబ్ మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ, భారత్, బంగ్లాదేశ్ సుదీర్ఘ కాలం నుంచి సత్సంబంధాలను కొనసాగిస్తున్నాయన్నారు. ఈ బాంధవ్యాన్ని దెబ్బతీసేందుకు ఛాందసవాదులు కుట్ర పన్నారన్నారు. ఇటువంటి సంఘటనలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందనే నమ్మకం ఉందన్నారు. ఆ దేశంలో మైనారిటీలపై దాడులు జరుగుతుండటం బాధాకరం, సిగ్గుచేటు అని పేర్కొన్నారు. 


హింసాకాండతో ప్రమేయం ఉన్నవారిలో కొందరిని బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్టు చేసిందన్నారు. అరెస్టయినవారికి ఛాందసవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. దుర్గా పూజల సందర్భంగా మత, సాంస్కృతిక సంస్థలపై దాడులు జరపడం ఛాందసవాదుల కుట్ర అని తెలిపారు. త్రిపుర ప్రజలు కూడా బంగ్లాదేశ్‌లో మైనారిటీలకు రక్షణ కల్పించాలని, హింసాకాండకు పాల్పడినవారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. 


త్రిపుర సరిహద్దులో బంగ్లాదేశ్ ఉంది. సుమారు 856 కిలోమీటర్ల మేరకు ఈ సరిహద్దు ఉంది. అక్టోబరు 15న బంగ్లాదేశ్‌లోని నౌఖాలీ జిల్లాలో దుర్గా పూజ మండపాలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే.


Updated Date - 2021-10-19T23:26:29+05:30 IST