టోల్‌ గేట్‌ నిర్మాణంపై గిరిజనుల నిరసన

ABN , First Publish Date - 2021-10-29T05:05:05+05:30 IST

మండలంలోని పినకిల్తారి గ్రామం వద్ద టోల్‌ గేట్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత ప్రజలు గురువారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

టోల్‌ గేట్‌ నిర్మాణంపై గిరిజనుల నిరసన
టోల్‌గేటు నిర్మాణం చేపట్టవద్దని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న గిరిజనులు


జి.మాడుగుల, అక్టోబరు 28: మండలంలోని పినకిల్తారి గ్రామం వద్ద టోల్‌ గేట్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత ప్రజలు గురువారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా వంజరి పంచాయతీ పినకిల్తారి వద్ద టోల్‌గేట్‌ నిర్మాణం చేపట్టేందుకు అధికారులు సర్వే చేశారు. ఈ నేపఽథ్యంలో గ్రామస్థులు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. టోల్‌గేట్‌ నిర్మాణం చేపడితే గ్రామంలో ఉన్న 40 కుటుంబాలు భూములను కోల్పోయి నిరాశ్రయులవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో టోల్‌గేటు నిర్మాణం చేపట్టవద్దని ఐటీడీఏ పీవో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఆర్డీవో, తహసీల్దార్‌లను కోరామని, అయినా అధికారులు సర్వే చేసేందుకు ప్రయత్నిస్తే అడ్డుకున్నామన్నారు. అనంతరం తహసీల్దార్‌ చిరంజీవిపడాల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు గంతన్నదొర, సన్యాసినాయుడు, చంటిబాబు, గణేశ్‌, విజయ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-10-29T05:05:05+05:30 IST