గాంధీలో చికిత్స బాగుంది
ABN , First Publish Date - 2020-07-05T07:54:23+05:30 IST
గాంధీ ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది చేస్తున్న సేవలు వెలకట్టలేనివని, సమయానికి ఆహారం, మందులు అందిస్తున్నారని.. వారిచ్చిన చికిత్స
- సమయానికి భోజనం, మందులు ఇస్తున్నారన్న రోగులు
- వీడియోలు విడుదల చేసిన గాంధీ వైద్యులు
హైదరాబాద్ సిటీ, జూలై 4(ఆంధ్రజ్యోతి): గాంధీ ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది చేస్తున్న సేవలు వెలకట్టలేనివని, సమయానికి ఆహారం, మందులు అందిస్తున్నారని.. వారిచ్చిన చికిత్స కారణంగానే కోలుకుంటున్నామని పలువురు కరోనా రోగులు తెలిపారు. గాంధీలో చికిత్స పొందిన/పొందుతున్న వారు తమకు ఎలాంటి సమస్యా లేదని వెల్లడించారు. రోజుకు రెండు సార్లు వైద్యులు వచ్చి పరీక్షిస్తున్నారని, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారని తెలిపారు. గాంధీ ఆస్పత్రి గురించి విని మొదట భయపడ్డామని కానీ, ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ల ట్రీట్మెంట్తో మెరుగవుతున్నామని చెప్పారు. కదలలేని పరిస్థితుల్లో ఉన్న కరోనా బాధితులకు నర్సులే స్వయంగా తినిపిస్తున్నారని తెలిపారు.
డిశ్చార్జి అవుతున్నా..: రిటైర్డ్ డాక్టర్ యాకూద్
నా వయస్సు 70. కరోనా సోకడంతో 15 రోజులుగా చికిత్స పొందుతున్నాను. ఇక్కడ సౌకర్యాలు బాగానే ఉన్నాయి. నేను గతంలో మహారాష్ట్రలో డివిజన్ మెడికల్ ఆఫీసర్గా పనిచేశాను. గాంధీ ఆస్పత్రి వైద్యులు బాగా చూసుకున్నారు. ఇంటికి వెళుతున్నందుకు సంతోషంగా ఉంది.
ముందు భయపడ్డా.. కానీ బాగుంది: ప్రమీల
గాంధీకి వచ్చి 22 రోజులైంది. ఇక్కడ డాక్టర్లు మంచిగా చూసుకుంటున్నా రు. దుస్తులు మార్చేందుకు, శుభ్రం చేసేందుకు రోజుకు 3 సార్లు వస్తున్నారు. మంచి భోజనం పెడుతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా అయింది.
ఆరోగ్యం మెరుగైంది: ఎండీ నజీర్
నాకు 38 ఏళ్లు. నేను హిమాయత్నగర్లో ఉంటాను. ముందుగా ఉస్మానియా వెళ్లాను అక్కడి నుంచి ఎర్రగడ్డకు వెళ్లాను. అక్కడ 5 రోజులున్న తర్వాత గాంధీకి తీసుకొచ్చారు. 10 రోజుల ట్రీట్మెంట్ తర్వాత చాలా బాగా అనిపించింది. మంచి భోజనం పెడుతున్నారు. సమయానికి మందులు ఇస్తున్నారు. త్వరలో డిశ్చార్జి చేస్తామని చెబుతున్నారు.