రవాణా స్కామ్ విచారణలో మరో అడుగు
ABN , First Publish Date - 2022-01-22T06:32:27+05:30 IST
అజ్ఞాతంలో ఉన్న అక్రమ రిజిస్ర్టేషన్ల స్కామ్ సూత్రధారి ముద్ర సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.
పోలీసుల అదుపులో సూత్రధారి!
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అజ్ఞాతంలో ఉన్న అక్రమ రిజిస్ర్టేషన్ల స్కామ్ సూత్రధారి ముద్ర సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించి విఫలం కావటంతో, అజ్ఞాతంలోనే ఉంటున్న సుబ్బారావును, అతని సన్నిహితుడు ఎం.సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వారిద్దరినీ రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ముద్ర సుబ్బారావు డ్రైవర్ను నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించటం ద్వారా, పోలీసులు వారిద్దరి ఆచూకీని కనుగొన్నట్టు సమాచారం. వీరిద్దరికీ సహకరించిన సూళ్లూరుపేట బ్రేక్ ఇన్ స్పెక్టర్ గోపీనాయక్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. గోపీనాయక్ శ్రీకాళహస్తి - తిరుపతి మధ్య ప్రాంతంలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారని సమాచారం. రహస్యంగా సొంత లాగిన్లను సృష్టించుకుని అక్రమ రిజిస్ర్టేషన్లకు పాల్పడిన జిల్లా రవాణా శాఖకు చెందిన పాండురంగ విఠల్పై కూడా కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఆయనను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో తాను చేసిన అక్రమాలను విఠల్ అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇదే సందర్భంలో రవాణా శాఖ పరంగా కూడా అంతర్గత విచారణ జరుగుతోంది. ఈ స్కామ్ గురించి అరుణాచల్ప్రదేశ్లోని రవాణా శాఖ అధికారులకు ఇక్కడి అధికారులు సమాచారం అందించారు.